ఎంత రెచ్చ‌గొట్టినా.. బాబు పొత్తుల‌తోనే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు.. పొత్తుల‌కు ఏదో అవినాభావ సంబంధం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఎన్నిక‌ల వ‌స్తే చాలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే సంప్ర‌దాయాన్ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం బాబు ఒంటరిగా ఎన్నిక‌ల బరిలో దిగే ప‌రిస్థితే లేకుండా పోయింది. 2019లో పైకి ఒంట‌రిగానే పోటీ చేసిన‌ట్లు క‌నిపించినా.. ర‌హ‌స్యంగా జ‌నసేన‌తో పొత్తు పెట్టుకున్నార‌ని బాబుపై వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌చ్చితంగా మ‌రోసారి ఒంట‌రిగా పోటీ చేసే సాహసం చేయ‌ర‌నే అభిప్రాయాలు బ‌లంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తుకు మార్గం క్లియ‌ర‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక బీజేపీని క‌లిపేసుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు తాజాగా బాబుకు విసిరిన స‌వాల్ ఆస‌క్తిక‌రంగా మారింది. పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నిక‌ల‌కు  వెళ్ల‌గ‌ల‌దా? అని వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నించారు. ధైర్యం ఉంటే ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌గ‌ల‌రా? అని స‌వాల్ విసిరారు. 2024లో తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్నామ‌ని ఆ ద‌మ్ము టీడీపీకి ఉందా అని అనిల్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనిల్ స‌వాల్‌పై టీడీపీ స్పందించే అవ‌కాశం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

2024 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం బాబుకు అత్య‌వ‌స‌రం. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోతే ఇక పార్టీ రాజ‌కీయ మ‌నుగ‌డ క‌ష్ట‌మే. ఈ విషయం బాబుకు తెలుసు. అందుకే మ‌రోసారి పొత్తుల‌తో వైసీపీకి చెక్ పెట్టాల‌ని చూస్తున్నారు. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పొత్తుల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా రెచ్చ‌గొట్టినా బాబు పొత్తుల‌తోనే ముందుకు సాగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే పంతాలు ప‌ట్టింపుల‌కు పోయి ఒంట‌రిగా దిగితే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో బాబుకు తెలుస‌ని నిపుణులు అంటున్నారు. అందుకే వైసీపీ నాయ‌కులు ఎంత‌గా రెచ్చ‌గొట్టినా బాబు మాత్రం సైలెంట్‌గానే ఉంటార‌ని చెబుతున్నారు.