ప‌వ‌న్ లేకుండా బీజేపీ ఏం చేస్తుంది?

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ఉంది. అందులో భాగంగానే 2024లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. కానీ ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయ పార్టీలు వేడి రాజేస్తున్నాయి. ఏపీలో రాజ‌కీయాలు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. పొత్తులు, సీట్ల వ్య‌వ‌హారంపై అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. సీఎం జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు విప‌క్షాలు ఏకమ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే పొత్తులో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ మాత్రం ఎన్నిక‌ల‌కు ముందు విడిపోయేలా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల జ‌నసేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ బీజేపీ పేరెత్త‌లేదు. వైసీపీని ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అందుకు అంద‌రూ క‌లిసి రావాల‌ని మాత్ర‌మే ఆయ‌న పేర్కొన్నారు. సొంత ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో పొత్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో జ‌న‌సేన‌, టీడీపీ ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు కుదుర్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌, బీజేపీ విడిపోయే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్య‌లు కూడా అందుకు ఊత‌మిస్తున్నాయి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేసేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే గ‌తంలో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాడ‌తామ‌ని జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి మీడియాకు చెప్పాయి. కానీ ఇప్పుడు కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఒంటరిగా పోరాటానికి సై అనేలా క‌నిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు వైసీపీని ఓడించేందుకు బీజేపీ రోడ్‌ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. కానీ వీర్రాజు మాత్రం రెండు నెల‌ల క్రిత‌మే అమిత్ షా త‌మ‌కు తిరుప‌తిలో రోడ్ మ్యాప్ ఇచ్చార‌ని చెప్పారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా వీర్రాజు మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే త‌మ‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ప‌వ‌న్ సాగుతున్నార‌ని, మ్యానిఫెస్టో కూడా ప్ర‌క‌టించార‌ని బీజేపీ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కానీ ప‌వ‌న్‌ను కాద‌నుకుని ఏపీలో బీజేపీ ఏం సాధిస్తుంది? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. జాతీయ స్థాయిలో జోష్ త‌ప్ప ఆ పార్టీకి ఏపీలో క్యాడ‌ర్ కూడా లేదు. క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి బ‌లం లేదు. పైగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంద‌నే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పొత్తుతో కాకుండా సింగిల్‌గా బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఎలాంటి ఫ‌లితం ఉండ‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.