విక‌టించిన పంజాబ్ ఫార్ములా.. భ‌ట్టి ఆశ‌లు గ‌ల్లంతు!

కాంగ్రెస్ అధిష్ఠానం ప్ర‌యోగించిన పంజాబ్ ఫార్ములా విక‌టించిందా..? ఈ ఫార్ములాతో విజ‌యం సాధించి మిగ‌తా రాష్ట్రాల్లో కూడా జెండా ఎగ‌రేయాల‌న్న ఆశ‌ల‌కు గండిప‌డిందా..? మ‌రోసారి దీనికి మొగ్గు చూపే సాహ‌సం చేస్తుందా..? ఈ ఫార్ములాపైనే ఆశలు పెట్టుకున్న తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆశ‌లు ఆదిలోనే అడుగంటాయా..? అంటే పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. పంజాబ్ పై కాంగ్రెస్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వ‌స్తున్న ఆ పార్టీకి పంజాబ్ ఊపిరిలూదుతుంద‌ని అంతా అనుకున్నారు. తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని అంద‌రూ ఊహించారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించ‌ని దెబ్బ కొట్టింది. ఏక‌ప‌క్ష విజ‌యంతో కాంగ్రెస్ ను క‌కావిక‌లం చేసింది. సీఎం చ‌న్నీతో పాటు.. పీసీసీ చీఫ్ సిద్ధూ కూడా ఓట‌మి పాల‌వ‌డంతో అధిష్టానం జీర్ణించుకోలేక‌పోతోంది.

నిర్మాణాత్మ‌కంగా బ‌లంగా ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ ఓట‌మి చాలా మంది విశ్లేష‌కుల‌కు విస్మ‌యం క‌లిగించింది. అయితే ఈ ఓట‌మికి స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణంగా తెలుస్తోంది. చేతులారా ఓటమిని కొనితెచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్న‌ గ్రూపు రాజ‌కీయాలు ఆ పార్టీని మ‌ట్టి క‌రిపించాయి. ముఖ్యంగా సీఎం చ‌న్నీకి, పీసీసీ చీఫ్.. మాజీ క్రికెట‌ర్ సిద్ధూకు ఉన్న విభేదాలు కాస్తా పార్టీని రెండుగా చీల్చేశాయ‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఎన్నిక‌ల‌కు సంవ‌త్స‌రం వ్య‌వ‌ధి గ‌డువు మాత్ర‌మే ఉన్న స‌మ‌యంలో సీఎంగా ఉన్న అమ‌రీంద‌ర్ ను త‌ప్పించారు. ఇదంతా సిద్ధూ పుణ్య‌మే. దీంతో అమ‌రీంద‌ర్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. దీంతో అధిష్ఠానం మ‌ధ్యేమార్గంగా ద‌ళితుడైన చ‌న్నీని సీఎంగా నియ‌మించి సిద్ధూ దూకుడుకు కూడా అడ్డుక‌ట్ట వేసింది. ఎన్నిక‌ల్లో కూడా సీఎం అభ్య‌ర్థిగా చ‌న్నీనే ప్ర‌క‌టించింది.

దీంతో కాంగ్రెస్ ప‌రిణామాల‌పైన విసుగు చెందిన ప్ర‌జ‌లు మార్పును కోరుకున్నారు. అలాగ‌నీ బీజేపీని నెత్తినెక్కించుకోలేదు. సామాన్య పార్టీయైన ఆప్ ను ఆద‌రించారు. ఢిల్లీకే ప‌రిమిత‌మైన ఆప్ ను పంజాబ్ కు కూడా తెచ్చుకున్నారు ప్ర‌జ‌లు. దీంతో జాతీయ పార్టీలు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను పొంద‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

పంజాబ్ ప‌రిణామాల‌పై తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆందోళ‌న‌గా ఉంది. ముఖ్యంగా సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆశ‌ల‌కు గండి ప‌డిన‌ట్లైంది. ఇదెలాగంటే.. పంజాబ్ లో ద‌ళిత సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన చ‌న్నీ గెలిచి సీఎం అయితే.. ఇక్క‌డా త‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని భ‌ట్టి ఆశించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే పంజాబ్ ను చూపించి తానూ సీఎం రేసులో ముందుండొచ్చ‌ని భ‌ట్టి భావించారు. ఇపుడు ఆ ఫార్ములా విఫ‌ల‌మ‌వ‌డంతో ఇక ఏ రాష్ట్రంలోనూ ఆ దిశ‌గా ఆలోచించ‌క‌పోవ‌చ్చు. దీంతో భ‌ట్టితో పాటు తెలంగాణ సీనియ‌ర్లు డైల‌మాలో ప‌డిపోయారు. చూడాలి మ‌రి రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో..!