జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలు మరింత సమగ్రంగా విచారణ జరపాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆ పిటిషన్ పై హైకోర్టు రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు. దీంతో రఘురామ మరోసారి పిటిషన్ వేశారు. తాజాగా దానిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. రఘురామ పిటీషన్ విచారణ అర్హత తేల్చేందుకుగానూ వెంటనే ఆ పిటిషన్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆ పిటిషన్‌ విచారణ అర్హతను తేల్చాలని హైకోర్టు నిర్ణయించింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ కు నెంబరు కేటాయించాలని  హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. వాదనలను వినకుండా ఉత్తర్వులెలా జారీ చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ పిల్ పై హైకోర్టు రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది.

దీంతో, ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు నిర్ధారిస్తే జగన్‌కు మరిన్ని చిక్కులు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ, ఈడీలు సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే జగన్‌ ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. కాగా, జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ అసమగ్రంగా విచారణ చేసిందని రఘురామ ఆరోపించారు.

విదేశాలనుంచి, బోగస్‌ కంపెనీలనుంచి జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఈడీ, ఐటీ శాఖలకు లేఖ రాసి చేతులు దులుపుకుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్‌ 2009లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. హౌరా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు ‘జగతి’లోకి వచ్చాయని, వాటిపై ఐటీ, ఈడీలకు లేఖ రాసి సీబీఐ సరిపెట్టిందని ఆరోపించారు.