లోకేష్ పై ఏపీ మంత్రి భౌతిక దాడికి ప్రయత్నించారా?

రెండు రోజుల శాసన సభ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీ ఆమోదించి బిల్లులను ప్రవేశపెట్టకుండానే డిప్యూటీ చైర్మన్ మండలిని నిరవధిక వాయిదా వేశారు. అయితే… బడ్జెట్ బిల్లులు పెట్టకుండా సభ ఆపరు అన్న దాంతో వాటికి ముందు రాజధాని బిల్లులు పెట్టి తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును పెట్టాలని అధికార పార్టీ చేసిన ప్రయత్నా్ని ప్రతిపక్షం అడ్డుకుంది. వాదనల అనంతరం చివరకు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టాలని డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధికారపక్షాన్ని ఆదేశించారు. అయినా అధికారపక్షం చర్చ ప్రారంభించలేదు.

దీంతో రూల్ నెంబర్ 90పై చర్చను చేపట్టాలని యనమలకు రెడ్డి సుబ్రమణ్యం సూచించారు. వెంటనే దానిని సద్వినియోం చేసుకుంది ప్రతిపక్షం. చర్చను రూల్ నెంబర్ 90 కింద యనమల ప్రారంభించారు. అయితే… యనమల ప్రసంగాన్ని అధికారపక్షం నేతలు తీవ్రంగా అడ్డుకున్నారు. ఇది తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. దీంతో సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.

ఏ బిల్లు పెట్టకుండా సభ వాయిదా వేస్తారా అన్న ఆగ్రహంతో ప్రతిపక్షంపై అభ్యంతకరమైన భాషతో అసెంబ్లీ లాబీల్లో మంత్రులు వైసీపీ నేతలు దూషణలకు దిగినట్లు సమాచారం. మీ ఇష్టానుసారం మాట్లాడతారా? అంటూ తెలుగుదేశం నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది తోపులాటకు దారితీసింది.

అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య తోపులాటలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కసారిగా లోకేష్ పైకి దూసుకెళ్లారని తెలుస్తోంది. అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రి వెల్లంపల్లిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు ఒకరిపై ఒకరు కలబడటంతో తోటి సభ్యులు వారిని పక్కకు లాగి గొడవను ఆపారు.