మంత్రి కొడాలికి చెక్‌.. చంద్ర‌బాబు వ్యూహం ఇదే

రాజ‌కీయాల్లో శ‌త్రువును గెల‌వాలంటే.. అంత‌కన్నా బ‌ల‌మైన వ్యక్తిని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. స‌ద‌రు ప్ర‌త్య‌ర్థికి ముకుతాడు వేయాలంటే.. ప్ర‌త్య‌ర్థి బ‌లాన్ని బ‌లంగా ఢీకొనే వ్యూహాలు ర‌చించాలి. ఇప్పుడు ఇదే వ్యూహాలతో ముందుకు సాగుతున్నార‌ట‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు కంట్లో న‌లుసులా.. చెప్పులో రాయిలా.. తీవ్ర‌స్థాయిలో ఇబ్బంది పెడుతున్న నాయ‌కుడు.. వైసీపీలోని ఫైర్ బ్రాండ్‌, మంత్రి కొడాలి నాని.  టీడీపీని ఎంద‌రో వైస‌పీ నాయ‌కులు టార్గెట్ చేస్తున్నా.. కొడాలి త‌ర‌హాలో ఇబ్బంది పెడుతున్న నాయ‌కులు లేరు. దీనికి కార‌ణం.. వ‌రుస విజ‌యాలు.

కృష్నా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న కొడాలి నాని.. త‌న‌కుతిరుగులేద‌నే విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను క‌నుక ఓడిస్తే.. త‌ప్ప‌.. త‌మ‌కు ప్రాభ‌వం పెర‌గ‌ద‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక ప్ర‌యోగాలు చేశారు.  2019 ఎన్నిక‌ల్లో యువ నాయ‌కుడు, దేవినేని అవినాష్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించారు. కోట్ల ర‌రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టించార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ.. కొడాలి మెజారిటీని త‌గ్గించారే త‌ప్ప‌.. గెలుపును ఆప‌లేక పోయారు. దీంతో కొడాలి మ‌రింత రెచ్చిపోతున్నారు.

త‌న‌ను ఓడించేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొడుతున్నారు. అంతేకాదు.. ఇప్పుడు మంత్రి అయిన త‌ర్వాత‌.. మరింత‌గా వేడి పెంచారు. ఏకంగా చంద్ర‌బాబును దారుణంగా దూషిస్తున్నారు.ఆయ‌న కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ అంశం తెరపైకి వచ్చినా.. టీడీపీ విమర్శలు చేసినా.. కొడాలి నాని తనదైన శైలిలో చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల క్యాసినో వ్యవహారం తర్వాత విమర్శలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గుడివాడలో కొడాలి నానీకి గట్టిపోటీనిచ్చే నేతలు నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది.

ఏ రకంగా చూసినా కృష్ణాజిల్లాలో కొడాలి నానిని ఢీ కొట్ట నేతలు టీడీపీకి లేరు. స్థానిక నేతలున్నా ఆయనకు పోటీనిచ్చే బలం వారికి లేదు. దీంతో ఎన్టీఆర్ కుటుంబాన్ని అభిమానించే కొడాలి నానిపై నందమూరి ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకర్ని బరిలో దించితే సరిపోతుందని నేత‌లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరు బాగా వినిపిస్తోంది. కొడాలి నాని ఓడించాలంటే బాలయ్యే కరెక్ట్ అని  అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ నటవారసుడగా సినిమాల్లో సత్తా చాటినట్లే.. ఆయన స్వస్థలంలోనూ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టాలని కోరుతున్నారట.

అయితే.. వరుసగా రెండుసార్లు హిందూపురంలో బాలకృష్ణ గెలుపొందారు. 2019లో రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉన్నా.. బాలకృష్ణ మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈనేప‌థ్యంలో తనను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గాన్ని వదిలి వస్తారా..? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఒక‌వేళ బాలకృష్ణ గుడివాడ వచ్చేందుకు నిరాకరిస్తే నందమూరి కుటుంబంలో ఎవరోఒకర్ని బరిలో దించాలని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. త్వరలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ హాజరువుతున్నారు. ఈ వేడుకల వేదికగానే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకర్ని చంద్రబాబు ఒప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది.  మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.