వివేకా హత్య ఘటనలో బిగుసుకుంటున్న ఉచ్చు?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను అప్పట్లో సీఐగా పనిచేసిన శంకరయ్య బయటపెట్టారు. వివేకా హత్య జరిగినపుడు పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ విచారించింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ వివేకా హత్యపై అసలు కేసే నమోదు చేయద్దని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, హత్యకేసులో అనుమానితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు శంకరయ్య తెలిపారు.

అసలు మృతదేహాన్ని పోస్టుమార్టం కు కూడా పంపద్దని తనపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే ఇదంతా జరిగిందని సీఐ చెప్పారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే హత్యకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ధ్వంసం చేసినట్లు వివరించారు. ఈ విషయాలను అప్పటి జిల్లా ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ దృష్టికి తీసుకెళ్ళినట్లు సీఐ వివరించారు. అలాగే ఎస్పీ ఆదేశాల ప్రకారమే తాను కేసులు నమోదు చేసిన విషయాన్ని కూడా చెప్పారు.

మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టి, గాయాలు కనబడకుండా కవర్ చేయాలని వీళ్ళంతా చేసిన ప్రయత్నాన్ని కూడా సీఐ వివరించారు. అయితే వీళ్ళ ప్రయత్నాలను తాను అడ్డుకున్నట్లు కూడా తెలిపారు. హత్య జరిగిన ప్రాంతం మొత్తాని వీడియో తీయాలని తమ సిబ్బంది చేసిన ప్రయత్నాలపై అవినాష్ వర్గం వారు విరుచుకుపడ్డారట.  సీబీఐకిచ్చిన వాంగ్మూలంలో సీఐ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. హత్య ఘటనలో ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై అనుమానాలు మాత్రమే ఉండేవి.   

సీబీఐ చార్జిషీటులో కూడా ఎంపీ పాత్రను అనుమానాస్పదంగా మాత్రమే చెప్పింది. అయితే సీఐ ఇచ్చిన వాంగ్మూలంతో అవినాష్ పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి వివేకా హత్య ఘటనలో తన పాత్ర లేదని ఎంపీ ఎలా సమర్ధించుకుంటారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే అప్రూవర్ గా మారిన వివేకా కారు డ్రైవర్ కూడా కొందరి పాత్రపై డిటైల్డ్ గా వివరించినట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఎంపీ పాత్రపై అన్ని వైపుల నుండి ఉచ్చు బిగుసుకుంటున్నట్లే అనిపిస్తోంది.