కొరకరాని కొయ్యలా రాజు.. జగన్ స్పందనపై ఆసక్తి

ప్రాంతీయ రాజకీయ పార్టీ అన్నాక క్రమశిక్షణ చాలా ముఖ్యం. కనుసైగతో కట్టడి చేయటం అవసరం. అందుకు భిన్నంగా మనసులో ఏమనిపిస్తే.. ఆ విషయాన్ని బయటకు వెల్లడిస్తే..పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుంది.

అందుకే.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సిద్దాంతాన్ని తల ఎగురవేసే సొంత నేతలపై ఆయా పార్టీలు అమలు చేస్తుంటాయి. తాజాగా నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త తలనొప్పిగా మారాయి.

జగన్ సర్కారు మీద విమర్శలు చేయాలంటే దమ్ముసరిపోని ఇప్పటి పరిస్థితుల్లో సొంత పార్టీకి చెందిన ఎంపీ చెలరేగిపోవటాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సొంత ఇమేజ్ తో పాటు.. ప్రజల్లో మంచి పేరున్న రఘురామ రాజును ఏం చేస్తే మంచిదన్న విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను అలా వదిలేస్తే..పార్టీలో కట్టు తప్పుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాజాగా చేసిన వ్యాఖ్యలతో రఘురామరాజు పూర్తిగా హద్దులు దాటేసినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయన పై కఠిన చర్యల్ని విధించాలని డిమాండ్ చేసేవారు లేకపోలేదు. ఒకవేళ.. ఆయనపై చర్యలు తీసుకుంటే.. సర్వస్వతంత్రుడై పార్టీకి వ్యతిరేకంగా మరిన్ని కామెంట్లు చేస్తే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లభించట్లేదు.

క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావటం.. మంచి మాటకారి అయిన నేపథ్యంలో ఏ మాత్రం తొందరపడినా తిప్పలు తప్పవన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెనువెంటనే చర్యలు తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆచితూచి నిర్ణయం తీసుకోవటం మరో ఆలోచనగా చెబుతున్నారు.

ఏమైనా..రఘురాముడి మీద చర్యలు చాలా త్వరలో ఉంటాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నారు. అయితే.. చెప్పినంత ఈజీగా ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండదని కొందరు చెబుతున్నారు. మరి.. జగన్ నిర్ణయం ఏమిటన్నది కాలమే డిసైడ్ చేయాలి.