రాజాసింగ్‌కు ఈసీ వార్నింగ్‌.. 24 గంట‌ల్లో వివ‌ర‌ణ‌కు ప‌ట్టు!

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణ బీజేపీ నేత‌, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర‌స్తాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసేలా.. ప్ర‌జ‌ల‌ను బెదిరించేలా మాట్లాడారంటూ.. చేసిన ఫిర్యాదుపై ఎన్నిక‌ల సంఘం స్పందించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్కు మద్దతుగా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ఓటర్లను బెదిరించినట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

ఆ వీడియో ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని పేర్కొన్న ఈసీ.. రాజాసింగ్కు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. కాగా, ఉత్తర్ప్రదేశ్లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ కొన్నాళ్ల కింద‌ట సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు.

ఉత్తర్ప్రదేశ్లో మరోసారి.. యోగి సర్కార్ రావాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగని రాజాసింగ్.. ఓటు వేయని వాళ్ల జాబితా తీసి వాళ్ల ఇళ్ల పైకి బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసమే యోగి.. వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని వ్యాఖ్యానించారు. ఉత్తర్ప్రదేశ్లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ అన్నారు.  “ఈ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలి. అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేసి మరోసారి గెలిపించాలి. కొందరు యోగి మళ్లీ సీఎం కాకూడదని కుట్రలు పన్నుతున్నారు“ అని రాజా సింగ్ అన్నారు.

అంత‌టితో ఆగ‌కుండా.. “వాళ్లకి నేను చెప్పేదొకటే.. యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి రప్పించారు. మూడో దశ పోలింగ్లో బీజేపికి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం. వాళ్ల అందరికి ఇళ్లపైకి ఈ బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం. మీకు తెలుసుగా.. ఇవి ఏం చేస్తాయో. యూపీలో ఉండాలంటే.. జై యోగి ఆదిత్యనాథ్ అనాల్సిందే. బీజేపీకి జై కొట్టాల్సిందే. లేకపోతే.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పారిపోవాల్సిందే“ అని రాజా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.