రెండు క‌త్తులు ఒకే ఒర‌లో

రాజ‌కీయాలు మ‌హా విచిత్రంగా ఉంటాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం స‌హ‌జ‌మే. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మ‌ళ్లీ తిరిగి ఒక్క‌ట‌వ‌డం ఎప్పుడూ క‌నిపించేది. మ‌రోవైపు ఒకే పార్టీలోని నేత‌ల మ‌ధ్య కూడా విభేదాలు వ‌స్తాయి. బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోతారు. కానీ మళ్లీ అంత‌లోనే మిత్రుల‌వుతారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లోనూ అలాంటి అరుదైన దృశ్య‌మే క‌నిపించింది. ఒక‌ప్పుడు మాట‌ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రు రెచ్చిపోయిన నేత‌లు ఇప్పుడు ఒక్క‌చోట క‌లిశారు. ఇక క‌లిసే పార్టీ కోసం ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వాళ్లే తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.

ఆ ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని..
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఓ వెలుగు వెలిగారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ప‌ట్టున్న నాయ‌కుడిగా ఎదిగారు. పార్టీలో సీనియ‌ర్ నేత‌గా మారారు. కానీ అలాంటి నాయ‌కుడికి గ‌తేడాది టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డారు. నిరుడు టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని అధిష్ఠానం రేవంత్‌రెడ్డికి అప్పగించ‌డంపై కోమ‌టిరెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ డ‌బ్బులిచ్చి ఆ ప‌ద‌వికి కొనుక్కున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీలో నిజాయ‌తీగా ప‌ని చేసిన వాళ్ల‌ను ప‌ట్టించుకోకుండా.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌ను అంద‌లం ఎక్కించ‌డం స‌రికాద‌ని విమ‌ర్శించారు. రేవంత్ టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలం గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌న‌ని కూడా ఆయ‌న శ‌ప‌థం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో తీవ్ర సంచ‌న‌ల రేపాయి. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ కూడా కోమ‌టిరెడ్డిని హెచ్చ‌రించింది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల గాంధీభ‌వ‌న్‌లో క‌నిపించారు.

అయినా త‌గ్గ‌లేదు..
అధిష్ఠానం నుంచి ఆదేశాలు వ‌చ్చినా కోమ‌టిరెడ్డి మాత్రం అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. రేవంత్‌ను టార్గెట్ చేస్తూనే ముందుకు సాగార‌నే అభిప్రాయాలున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫ‌లితాల‌కు కార‌ణం రేవంత్ అని కోమ‌టిరెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. పార్టీ కోసం ప‌ని చేయ‌కుండా వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకోవ‌డం కోసం రేవంత్ ప‌ని చేస్తున్నార‌ని వాళ్లు అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టారు. మ‌రోవైపు రేవంత్ కూడా.. సీనియ‌ర్లు ఏమ‌నుకున్నా ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు.

దీంతో కోమ‌టిరెడ్డి, రేవంత్ రెడ్డి క‌లిసి ప‌ని చేయ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ ఇప్పుడు త‌మ మ‌ధ్య విభేదాల‌ను ప‌క్క‌కుపెట్టి పార్టీ కోసం క‌లిసి ప‌ని చేసేందుకు ఇద్ద‌రు నేత‌లు సిద్ధ‌మయ్యారు. తాజాగా కోమ‌టిరెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌.. ఆయ‌న‌తో మూడు గంట‌ల పాటు స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ అభివృద్ధికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఇద్ద‌రు నేత‌లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వ‌ర్గాల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. రేవంత్ సార‌థ్యంలో పార్టీ ప‌రుగులు పెడుతుంద‌ని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇప్పుడు కోమ‌టిరెడ్డి కూడా క‌లిసి రావ‌డంతో పార్టీకి తిరుగుండ‌ద‌ని చెబుతున్నాయి.