సీఎం సొంత జిల్లాకు చెందిన అధికారే ఏపీ కొత్త డీజీపీ

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన వారు. విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్‌గానూ రాజేంద్రనాథ్‌రెడ్డి పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు. హైద‌రాబాద్‌లోనూ ఆయ‌న సేవ‌లు అందించారు.  ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కొన‌సాగుతున్నారు.

 డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించిన అనంతరం సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. 1992 బ్యాచ్‌కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి 2026 ఏప్రిల్‌ 30 వరకు విధుల్లో ఉండే అవకాశముంది. మ‌రోవైపుఉద్వాస‌న‌కు గురైన ప్ర‌స్తుత డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కి ప్ర‌బుత్వం ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.  తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతమ్‌ సవాంగ్‌ను సర్కార్ ఆదేశించింది. 2023 జులై వరకు సవాంగ్‌కు పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు నూతన డీజీపీ నియామకం కోసం ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. యూపీఎస్సీ నుంచి వచ్చిన సిఫార్సుల ప్రకారం నూతన డీజీపీని నియమించనున్నట్టు సమాచారం.

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్ర డీజీపీగా  నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్ర నాథ్ రెడ్డి అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి ఏపీ  గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆయన 1981 సంవత్సరంలో ఏపీ ఆర్ ఎస్ పాఠశాల నుండి ఉత్తీర్ణులు అయ్యారు. రాష్ట్ర డీజీపీగా నియమితులై నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధరరావు పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది ఏపీ ఆర్ ఎస్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత పదవుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేవలు అందిస్తున్నారని నేడు కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర డిజిపిగా నియమితులు కావడం పాఠశాల ఎంతో గర్వ పడుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

కొత్త డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిది కడప జిల్లా రాజుపాలెం మండలంలోని పర్లపాడు గ్రామం. 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. 1994లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్లో బాధ్యతలు చేపట్టారు. 1996లో వరంగల్ జిల్లా జనగాంలో ఏఎస్పీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగానూ పని చేశారు. 1996-97 వరకు కరీంనగర్లో ఆపరేషన్స్ ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు.

1997-99లో విశాఖ రూరల్ ఎస్పీగా అనంతరం సీఐడీ ఎస్పీ, గుంతకల్లు రైల్వే ఎస్పీ, విజయవాడ రైల్వే ఎస్పీగా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. అక్కడ నుంచి నెల్లూరు ఎస్పీ, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. 2006-08 వరకు ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. 2008-10 వరకు విజయవాడ సీపీ, 2010-11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ, ఐజీగా విధులు చేపట్టారు. 2011-13 వరకు నార్త్ కోస్టల్ ఐజీగా, 2013-14 వరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా, 2015-17 వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పని చేశారు. 2018-19 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2019-20 వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా.. 2020 నుంచి ఇంటెలిజెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.