ప్రభుత్వ వీళ్ళని పట్టించుకుంటుందా ?

పీఆర్సీకి సంబంధించి 27 శాతం ఫిట్మెంట్ కోసం ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. మెరుగైన ఫిట్మెంట్ సాధించాల్సిందే అనే టార్గెట్ తో పై సంఘాలన్నీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 15-28 తేదీల్లో దశలవారీగా ఆందోళనలు, నిరసనలు చేయాలని డిసైడ్ అయ్యాయి. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటపుడు చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని కూడా నిర్ణయించాయి.

సరే వీళ్ళ కార్యాచరణ వీళ్ళిష్టమే అనటంలో సందేహం లేదు. అయితే వీళ్ళని ప్రభుత్వం అసలు పట్టించుకుంటోందా అనేది సందేహం. ఎందుకంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంత పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఇంతచేసినా ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లకు తలొంచలేదు. వీళ్ళెంత బెదిరించినా బెదరలేదు. మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటి వేసి వాళ్ళతోనే చర్చించమని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

మంత్రుల కమిటినే పదే పదే పీఆర్సీ సాధన సమితి నేతలను చర్చలకు పిలిచిందే కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళ డిమాండ్లు నెరవేర్చేందుకు దిగిరాలేదు. చివరకు ఐఆర్ రికవరీ చేసేదిలేదని, హెచ్ఆర్ఏ శ్లాబులను సవరించిందే కానీ ఫిట్మెంట్ ను మాత్రం 23కి మించి పెంచేది లేదని తెగేసి చెప్పేసింది. చివరకు ఒకటకి రెండుసార్లు చర్చలు జరిగి సమ్మె విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించాల్సొచ్చింది. వీళ్ళు సమ్మె విరమించుకునేందుకు న్యాయస్దానం చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. సమ్మె చేసే హక్కు ఉద్యోగులకు లేదని, రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి ప్రకారమే జీతాలు పెరుగుదల ఉంటుందని కోర్టు స్పష్టంగా చెప్పేసింది.

పైగా సమ్మెలోకి వెళ్ళే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో సమాజంలోని ఏ వర్గం కూడా వీళ్ళ సమ్మెకు మద్దతుగా నిలవలేదు. దాంతో పరిస్దితిని అర్ధం చేసుకున్న పీఆర్సీ సాధన సమితి నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లోనే ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం ఇపుడు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెను పట్టించుకుంటుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జీతాలు తగ్గుతాయంటే అర్ధముంది కానీ ఏదో రూపంలో పెరిగిన జీతాలు అందుకుని కూడా సమ్మెంటే విచిత్రంగా ఉంది.