గోవాను కూడా చెడగొట్టేశారే!

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఏ ప‌రిస్థితులు ఎలాంటి దారి తీసుకుంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో పార్టీలు వివిధ ప‌రిణామాల‌కు తెర‌తీస్తాయి. సామాజిక వ‌ర్గం, మ‌తం, కులం.. ఇలా అన్ని ర‌కాలుగా ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. దేశ రాజకీయాల్లో ఈ వ్య‌వ‌హారం ఎప్ప‌టినుంచో కొన‌సాగుతోంది. కానీ దేశంలోని గోవా రాష్ట్రంలో మాత్రం ఈ ఎన్నిక‌ల్లోనే స‌రికొత్త‌గా కుల రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కుల స‌మీక‌ర‌ణాల ఆధారంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయ‌ని అంటున్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమెను వెన‌కుండి న‌డిపిస్తున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ ఇవ్వ‌డం కూడా అందుకు ఓ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ప‌ర్యాట‌కుల‌తో ఎప్పుడూ సంద‌డిగా ఉండే గోవా రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లు వేడి రాజేశాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌న్నీ కుల రాజ‌కీయాల‌పైనే న‌డుస్తాయి.

కానీ గోవాలో అందుకు విభిన్నంగా ప‌రిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని అక్క‌డ కూడా కుల రాజ‌కీయాలు పుట్టుకొచ్చాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో భండారీల‌కు 18 చోట్ల మంచి ప‌ట్టుంది. దీంతో ఈ వ‌ర్గం వాళ్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్ పార్టీలు దృష్టి సారించాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా భండారీ స‌మాజ్‌కు చెందిన అమిత్ పాలేక‌ర్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు. దీంతో ఇత‌ర పార్టీలు కూడా ఈ సామాజిక వ‌ర్గంపై ధ్యాస పెట్టాల్సి వ‌చ్చింది.

పార్టీని ఇత‌ర రాష్ట్రాల‌కు విస్త‌రించి ప‌ట్టు పెంచుకోవాల‌ని చూస్తున్న టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఎన్నిక‌ల వ్యూహంలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్నారు. గోవాలో అధికారం కోసం అక్క‌డి పార్టీల‌తో క‌లిసి పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఆమె కూడా భండారీ సామాజిక‌వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఆరుగురికి బీజేపీ, ముగ్గురికి కాంగ్రెస్ సీట్లు క‌ట్ట‌బెట్టాయి. మ‌రోవైపు గోవాలో కుల రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌ద‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తోంది. కానీ పార్టీలు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయాయి. భండారీల త‌ర్వాత అత్య‌ధిక ఓట‌ర్లు ఉన్న‌ర ఖ‌ర్వా వ‌ర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీల మ‌ద్ద‌తు కూట‌గ‌ట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్నాయి.