రోజాకు ఝ‌ల‌క్ త‌ప్ప‌దా..?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు ఈ సారికూడా ఝ‌ల‌క్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని చిత్తూరు జిల్లా న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్న రోజా.. 2014లో పార్టీ కోసం.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అసెంబ్లీలో అప్ప‌టి స‌ర్కారుపైనా.. సీఎం చంద్ర‌బాబుపైనా నిప్పులు చెరిగారు. ఈ క్ర‌మంలోనే ఏడాది పాటు స‌స్పెండ్ కు కూడా గుర‌య్యారు. ఇలా పార్టీకోసం.. ఏమైనా చేసేందుకు నేను సిద్ధ‌మ‌నే సంకేతాల‌ను బ‌లంగా పంపించారు. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులే వేయించుకున్నారు.

ఈ క్ర‌మంలో 2019లో వైసీపీ స‌ర్కారు వ‌చ్చినప్పుడు త‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. ఆమె ఆశించారు. అంతేకాదు.. ఏకంగా హోం శాఖ మంత్రిగా ఆమెను జ‌గ‌న్ కూర్చోబెడ‌తార‌ని.. ప‌రోక్షంగా వార్త‌లు కూడా రాయించుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే.. చిత్తూరు జిల్లా నుంచి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు, పెద్ద త‌ల‌కాయ్‌గాభావించే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, ఎస్సీ కోటాలో నారాయ‌ణ స్వామికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. దీంతో రోజా ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. కొన్ని రోజులు అలిగిన ఆమె త‌ర్వాత‌.. ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వికి క‌ట్ట‌బెట్ట‌డంతో శాంతించారు. అయితే..ఇ ప్ప‌డు మ‌రోసారి మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే దీనిని పూర్తి చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ… కొన్ని కార‌ణాల‌తో వాయిదా వేవారు. దీనిని ఉగాది త‌ర్వాత‌.. చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. అయితే.. అప్పుడు కూడా రోజాకు అవ‌కాశం ద‌క్క‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే.,. కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు.  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు. దీంతో పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేవు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలున్నాయి.

ఇదిలావుంటే, చిత్తూరు ను విభ‌జించి ఏర్పాటు చేయ‌నున్న శ్రీబాలాజీ జిల్లా నుంచి ఇద్ద‌రు కీల‌క నేత‌లు పోటీలో ఉన్నారు. శ్రీబాలాజీ జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం శ్రీబాలాజీ జిల్లాలోకి వచ్చి చేరింది. అదేవిధంగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఒక‌వేళ శ్రీబాలాజీ జిల్లాకు.. మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తే.. ఖ‌చ్చితంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఉంటుంది. అయితే.. సీఎం కుటుంబానికి ఆప్తుడిగా గుర్తింపు పొందిన చెవిరెడ్డికి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. అలాగ‌ని భూమ‌న‌ను ప‌క్క‌న పెడ‌తారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.