పార్టీల ఉచిత హామీలకు బ్రేకులు ?

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయాలు ప్రకటించే ఉచిత హామీలకు ఇప్పటికైనా బ్రేకులు పడతాయా ? ఏమో పడతాయనే అనుకుంటున్నారు సుప్రీంకోర్టు తీరు చూసిన తర్వాత. ఉచిత హామీలపై లాయర్, బీజేపీ నేత అశ్విన్ ఉపాధ్యాయ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఉచితాలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.

ఉచిత హామీలపై పార్టీలు ఇస్తున్న హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని చెప్పడం నూరుశాతం వాస్తవం. కేవలం ఓట్ల కోసమే పార్టీలన్నీ ఉచితాల బాటనే నడుస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితితో ఎలాంటి సంబంధం లేకుండా అధికారంలోకి రావాలన్నదే టార్గెట్ గా పార్టీలు ఉచిత హామీలను ఇచ్చేస్తున్నాయి. కేసు విచారణ సందర్భంగా సీజే మాట్లాడుతూ ఉచిత హామీలకు బ్రేకులు వేయటం తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతోనే మొదలు పెట్టవచ్చా అని ప్రశ్నించారు.

ఇపుడు సాధ్యం కాకపోతే కనీసం వచ్చే సాధారణ ఎన్నికల్లో అయినా బ్రేకులు వేయాల్సిందే అన్నారు. ఆచరణ సాధ్యం కాని ఉచిత హామీలను ఇచ్చేయటం ఆ తర్వాత వాటిని మరచిపోవటమో లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడటమో జరుగుతున్న విషయాన్ని చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు. కాబట్టి ఉచిత హామీలకు బ్రేకులు వేయటంపై అభిప్రాయం చెప్పాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేశారు.

మిగిలిన రాష్ట్రాలను పక్కన పెట్టేస్తే రాష్ట్ర విభజన తర్వాత  2014 లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు, జగన్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఆ తర్వాత వాటిని వంద శాతం అమలు చేయలేక చేతులెత్తేశారు. తర్వాత 2019లో  జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డగోలుగా చాలా ఉచిత హామీలను గుప్పించారు. వాటిని అమలు చేయటంలో ఖజానా గుల్లయిపోతున్నా పట్టించుకోవటం లేదు. ఈ పథకాల వల్ల ఏపీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు తెలంగాణ ఖజానాను ఖాళీ చేస్తోంది. 

వీళ్ళద్దరు ఉచిత హామీలివ్వకపోతే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉండేదికాదు. ఉచిత హామీల సమస్య ఏపీకనే కాదు అన్ని రాష్ట్రాల్లో పరిస్ధితి ఒకేలాగుంది. కాబట్టి సుప్రీంకోర్టు కొరడా ఝలిపిస్తే కానీ రాజకీయ పార్టీలు దారిలోకి రావు.