బీజేపీని ఓడించటం సాధ్యం కాదు

ఇప్పటికిప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించటం సాధ్యమయ్యే పని కాదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తేల్చేశారు. మామూలుగా అయితే బీజేపీని ఓడించటం పెద్ద కష్టమేమీ కాదని కానీ ఆ పని కాంగ్రెస్ నేతృత్వంలో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒకసారి పీకే చెప్పారు. 6 నెలల వ్యూహంతో బీజేపీని ఓడించాలంటే జరిగే పని కాదని పీకే అభిప్రాయపడ్డారు.

బీజేపీని ఓడించాలంటే 5-10 సంవత్సరాల ప్రణాళిక అవసరమన్నారు. ఒకసారేమో 2024లో బీజేపీని ఓడించటం సాధ్యమే అని చెబుతునే మరోవైపు 6 మాసాల ప్రణాళికతో అందులోను కాంగ్రెస్ నేతృత్వంలో సాధ్యం కాదని చెప్పటం పీకేకే చెల్లింది. ఒక దశలో పీకే ఆల్మోస్ట్ కాంగ్రెస్ లో చేరి కీలకపాత్ర పోషిస్తారనే అందరూ అనుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకగాంధీతో కూడీ పీకే భేటీ అయ్యారు. దాంతో ఇక రేమో మాపో పీకే కాంగ్రెస్ లో చేరిపోవటమే మిగిలిందనే అనుకున్నారందరు.

కానీ తెరవెనుక ఏమైందో ఏమో కాంగ్రెస్ లో చేరటం లేదని పీకే ప్రకటించారు. పార్టీ వర్గాల ప్రకారం పీకే అత్యంత కీలకమైన రాజకీయ సలహాదారు పదవి కావాలని పట్టుబట్టారట. అంటే చనిపోయేముందు అహ్మద్ పటేల్ నిర్వహించిన పోస్టది. రాజకీయ సలహాదారంటే సోనియాగాంధీ తర్వాత అంతటి కీలకమైన పోస్టు. అలాంటి పోస్టును పీకేకి ఇవ్వటానికి పార్టీలో ఎవరు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. దాని కారణంగానే పీకే కాంగ్రెస్ లో చేరిక నిలిచిపోయినట్లు ప్రచారంలో ఉంది.

 అప్పటినుండే కాంగ్రెస్ అంటేనే పీకే మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను లీడ్ చేయటం కాంగ్రెస్ వల్ల కాదని పదే పదే చెబుతున్నారు. ఇపుడు కూడా అదేమాట చెప్పారు. ఇక్కడ విచిత్రమేమిటంటే కాంగ్రెస్ కాకుండా జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించేంత సీన్ మరే పార్టీకి లేదు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలు మాత్రమే. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్ లాంటివి జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నా వాస్తవానికి వాటికంత సీన్ లేదు. అందుకనే నరేంద్రద మోడీ హ్యాపీగా ఉన్నారు.