జగన్ గుర్తించకపోతే అంతే సంగతులు

ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తప్పే చేస్తున్నారు. అదనంగా ఇవ్వకపోయినా ఉద్యోగులు ఏదోలా సర్దుకుంటారు కానీ చేతిలో ఉన్నది కూడా లాక్కుంటానంటే ఎందుకు ఊరుకుంటారు ? ఇపుడు జగన్ ప్రభుత్వం చేసిందిదే. ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా రెచ్చగొడుతోంది ప్రభుత్వం. పీఆర్సీ విషయంలో కోత పెట్టినా అదనంగా రెండు అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి సర్దుకున్నారు.

రిటైర్మెంట్ వయసు పెంచటం, ఇళ్ల స్థలాల్లో ప్రాధాన్యత, రాయితీలని జగన్ చెబితే ఫిట్మెంట్ తగ్గినా అంగీకరించారు. అంతేకానీ సంవత్సరాల తరబడి ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించేస్తామని అంటే ఎందుకు ఒప్పుకుంటారు ? ఇపుడు జరుగుతున్నదిదే. ఆందోళనకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన హెచ్ఆర్ఏ అసంబంద్ధంగా ఉంది. 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే 24 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తామని చెప్పటమే పెద్ద జోక్. అసలు రాష్ట్రం మొత్తం మీద 50 లక్షలున్న నగరమే లేదు. మరిలాంటి నిబంధన పెట్టడమంటే ఉద్యోగులను రెచ్చగొటడ్డమే కదా.

పనిలోపనిగా హెచ్ఆర్ఏ శ్లాబులన్నింటినీ మార్చేసింది. ప్రతిశ్లాబూ ఉద్యోగులకు నష్టాన్నే కలిగిస్తుంది. అలాగే సీసీఏ పూర్తిగా రద్దు చేసింది. ఇకనుండి రాష్ట్రస్థాయిలో పీఆర్సీ కాకుండా కేంద్రం పద్ధతిలో వేతన సవరణ చేస్తామని చెప్పింది. పీఆర్సీ అంటే ఐదేళ్ళకొకసారి వేస్తారు. అదే కేంద్రం పద్దతంటే పదేళ్ళకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. మొత్తం మీద ప్రభుత్వం అంటే ఉద్యోగులకు వ్యతిరేకంగానే వెళుతోందనేది స్పష్టమైపోయింది. ఇక్కడ ఉన్నతాధికారులు తప్పు చేస్తున్నారా ? లేకపోతే జగనే తప్పు చేస్తున్నారా అన్నది పాయింట్ కాదు.

తప్పు ఎవరు చేసినా బాధ్యత వహించాల్సింది జగనే. రేపు ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి ఎదురుతిరిగితే నష్టపోయేది జగనే కానీ ఉన్నతాధికారులు కాదు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఆడుకోవటం చాలా తప్పు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు జరిగే నష్టం జగన్ కే కానీ ఇంకెవరికీ కాదు. ఇప్పటికైనా జగన్ మేల్కోనకపోతే అంతే సంగతులు.