కాంగ్రెస్ గూటికి డీఎస్‌

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రోమారు వేడెక్కాయి. సీనియ‌ర్ నాయ‌కుడు.. కాంగ్రెస్ పార్టీ ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ కేంద్రంగా రాజ‌కీయాలు మ‌రోసారి యూటర్న్ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అధికార పార్టీ నాయ‌కుడిగా.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న డీఎస్ కు సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య గ్యాప్‌బారీగా పెరిగిపోయింది. దీంతో చాన్నాళ్లుగా ఆయ‌న అదికార పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ మార‌తార‌ని.. తన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ.. అర్వింద్‌తో క‌లిసి బీజేపీలో చ‌క్రం తిప్పుతార‌ని.. కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.అ యితే.. ఇప్పుడు డీఎస్ వ్యూహం మ‌రో లా ఉంద‌ని అంటున్నారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్ త్వ‌ర‌లోనే కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ కారు దిగి కాంగ్రెస్ హ‌స్తం పట్టుకోబోతున్నారని ప‌రిశీలకులు చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలిసింది. గత కొంతకాలంగా శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్త‌వానికి రాజకీయంగా డీఎస్‌ ఎదుగుదలంతా కాంగ్రెస్‌ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు.

రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది. త్వ‌ర‌లోనే డీఎస్ రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం కూడా పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీఆర్ ఎస్ ను వీడ‌నున్నార‌ని తెలిసింది. ఇదేస‌మ‌యంలో రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ కాంగ్రెస్‌‌లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి డీఎస్‌ ఇంటికి వెళ్లి  ఆయ‌న‌ను పరామర్శించారు.

అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్‌లో చేర‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు డీఎస్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నార‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే.. రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.