మోడీ విష‌యంలో కాంగ్రెస్ త‌ప్పు

త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న పంజాబ్‌లో అక్క‌డి అధికార కాంగ్రెస్ పార్టీ త‌ప్పు చేసిందా?  మోడీ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్న‌వారిని నిలువ‌రించ‌డంలో చూపిన నిర్ల‌క్ష్యం(అది అనుకోకుండా అయినా.. ఉద్దేశ పూర్వ‌కంగానే అయినా) ఇప్పుడు కాంగ్రెస్‌కే ఇబ్బందులు తెచ్చిపెడుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మోడీ ఘ‌ట‌న త‌ర్వాత‌.. బీజేపీ దూకుడు పెంచింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు.. దీనిని త‌మ‌కు అవ‌కాశంగా మార్చుకుని కాంగ్రెస్‌పై మ‌రింత దూకుడు పెంచేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఈ అంశాన్ని తీసుకువెళ్లి.. కాంగ్రెస్‌ను మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేసింది.

పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ భద్రతా లోపాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం బీజేపీ- కాంగ్రెస్ మధ్య చిచ్చురేపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది బీజేపీ. కాంగ్రెస్కు వ్యతిరేకంగా.. జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్ర‌మంలో తొలుత ఢిల్లీలోని రాజ్ ఘాట్(మహాత్మాగాంధీ స్మారకం) వద్ద బీజేపీ ఎంపీలు మౌన దీక్ష చేపట్టారు. ‘భారత్ స్టాండ్స్ విత్ పీఎం మోడీ’ అని ఉన్న ప్లకార్డులు పట్టుకొని రెండు గంటలసేపు నిరసన తెలియజేశారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.

అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్లకు నిరసనగా వెళ్లి మెమోరాండం సమర్పించాలని.. బీజేపీ అగ్ర నేత‌లు వ్యూహాలు సిద్ధం చేశారు.
గుజరాత్లో బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నేతృత్వంలోని బృందం.. గవర్నర్ ఆచార్య దేవ్వ్రతాను కలిసి మెమోరాండం సమర్పించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందించాల్సిందిగా కోరారు నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా గవర్నర్ను కలిసిన బృందంలో ఉన్నారు.

కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు.. దేశవ్యాప్తంగా వరుస నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని నిర్ణయించింది. బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా  కొవ్వొత్తుల ర్యాలీలు కూడా జరిగాయి. ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన కొందరు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్లోని తిల్హర్లో జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. భద్రతా వైఫల్యం కారణంగా.. ఆయన కాన్వాయ్ సుమారు 20 నిమిషాలపాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. అక్కడి నుంచి వెంటనే ఆయ‌న‌ ఢిల్లీకి పయనమయ్యారు. మోడీ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా మరో త్రిసభ్య కమిటీని నియమించింది. అయితే.. దీనిని ఇక్క‌డితో ఇలా వ‌దిలి వేయ‌కుండా.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసేందుకు మున్ముందు.. మ‌రింత దూకుడుగా బీజేపీ ముందుకు సాగ‌డం.. కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో పెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.