కరోనాకు విరుగుడు కనిపెట్టిన ఎర్రబెల్లి

ఓ వైపు కరోనా గురించి వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు అవగాహన కలిగించేందుకు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, మాస్క్ ధరించడంపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో వాట్సాప్ యూనివర్సిటీల్లో పీహెచ్ డీలు చేసిన కొందరు నేతలు తమ పైత్యాన్నంతా ప్రజలపై రుద్దుతున్నారు. గోమూత్రంతో కరోనా పోతుందంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంపై విమర్శలు వచ్చాయి. ఇక గో కరోనా గో అంటూ బీజేపీ నేత అథవాలే అన్న మాటల పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనాపై వాట్సాప్ ప్రొఫెసర్లు వదిలిన ఎన్నో ఆణిముత్యాలు మనకు దొరుకుతాయి. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరారు. కరోనా కడుపులోకి చేరితే….పిప్పి పిప్పి అయి బయటకు వస్తుందంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://www.youtube.com/watch?v=bKWosmh07_0

ఓ సభలో కరోనా వైరస్ గురించి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వచ్చి పడిశంలో, గొంతులో ఉంటే శరీరానికి ఎక్కుతుందని, జ్వరం, జలుబు లేకపోతే కరోనా కడుపులోకి పోతుందని అన్నారు. మన కడుపులో మిషన్ మంచిదని, బొక్కలు(ఎముకలు), సిమెంట్ వంటి వాటిని కూడా నమిలిపెడుతుందని, కాబట్టి కడుపులోకి కరోనా పోతే పిప్పి పిప్పి అయ్యి బయటకు వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గొంతులో, ముక్కులో శరీరంపై కరోనా ప్రభావం చూపుతుందన్న ఎర్రబెల్లి…వేడి నీటి ద్వారా కడుపులోకి వెళ్తే.. ఇబ్బందేం ఉండదంటూ సెలవిచ్చారు. ఎర్రబెల్లి కామెంట్స్ పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. డాక్టర్ ఎర్రబెల్లి…ఎంబీబీఎస్, ఎండీ, ఎఫ్ ఆర్సీఎస్, చైనా వచ్చేశారని…ఇక కరోనా పారిపోతుందని ట్రోల్ చేస్తున్నారు. ‘ఎర్రబెల్లి ఉండగా కరోనా గురించి భయమెందుకు దండగా’ అంటూ మరో నెటిజన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎర్రబెల్లి దెబ్బకు గజగజ వణికిపోతోన్న కరోనా అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు, మీమ్స్ పేలుతున్నాయి. బెల్లీ థియరీతో ఎర్రబెల్లి లొల్లి అంటూ పంచ్ లు వేస్తున్నారు.