ముంద‌స్తు ఎన్నిక‌లే ల‌క్ష్యం.. చంద్ర‌బాబు వ్యూహం?

రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల సంచ‌ల న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న వేగాన్ని పెంచారు. అదేస‌మ‌యంలో వ్యూహా ల‌ను కూడా మార్చుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పడొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని సన్నద్ధం చేసే దిశగా  వ్యూహ రచన చేస్తున్నారు.

పార్టీ  మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలంటే 2022 సంవత్సరం ఎంతో కీలకమని భావిస్తున్న ఆయన…, అందుకు తగ్గట్టుగా గేర్ మార్చి దూకుడు పెంచేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా రెండు వరుస కీలక సమావేశాలు నిర్వహించ నున్నారు. కొత్త సంవత్సరం పార్టీ శ్రేణులకు లక్ష్య నిర్దేశం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కార్యాచరణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త ఏడాది పార్టీ అనుసరించే విధానాలను వివరించనున్నారు.

అనంతరం రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉన్న 22పురపాలక సంఘాలకు సంబంధించి ఆయా నియోజకవర్గ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. రేపు అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఇంఛార్జిలతో భేటీ కానున్న చంద్రబాబు… వారికి లక్ష్యాలను నిర్దేశించనున్నారు. ఈ నెల 6 నుంచి 3 రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించను న్నారు. స్థానికంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజల్ని కలుస్తారు.

11, 12, 13తేదీల్లో తిరిగి అమరావతి కేంద్రంగా రాజకీయ సమీక్ష లు చేపట్టనున్నారు. అయితే.. ఈ వ్యూహాలు.. మొత్తం కూడా పార్టీని మ‌ళ్లీ ఉత్తేజం చేయ‌డంలో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే.. పార్టీలో అన్ని ప‌ద‌వులను భ‌ర్తీ చేశారు. జిల్లా, మండ‌ల స్థాయిలోనూ పార్టీలో కీల‌క ప‌ద‌వులు భ‌ర్తీ చేశారు. ఈ నేప‌థ్యంలో నూత‌న వ్యూహాల‌తో పార్టీని ప‌ర‌గులు పెట్టించేందుకు చంద్ర‌బాబు రెడీ అవ‌డం.. ముంద‌స్తు వ్యూహంలో భాగ‌మేన‌నే సంకేతాలు పంపుతోంది. మ‌రి కార్యాచ‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాలి.