గెలుపు బీజేపీదే కానీ…

రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీలు ఎంతగా పోరాడుతున్నాయో అందరు చూస్తున్నదే. ఈ నేపధ్యంలో పార్టీలు కావచ్చు లేదా మీడియా సంస్ధలు కూడా కావచ్చు ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నాయి. తాజాగా టైమ్స్ నౌ-నవభారత్ మీడియా కోసం వీటో అనే సంస్ధ సర్వే నిర్వహించింది. పోయిన నెల 14-30 తేదీల మధ్య రాష్ట్రం మొత్తం తిరిగి వీటో సంస్ధ సర్వే నిర్వహించింది.

ఈ సర్వే ప్రకారం మళ్ళీ యోగి సర్కారే అధికారంలోకి రాబోతోందని తేలింది. అంటే వరుసగా రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తోందని అర్ధమవుతోంది. కాకపోతే సీట్ల సంఖ్యలో పెద్దఎత్తున కోత పడుతోంది స్పష్టమవుతోంది.  403 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ కూటమికి 321 సీట్లున్నాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో కూటమి 240 సీట్లకు మించదని సర్వేలో వచ్చింది. అంటే దాదాపు 80 సీట్లలో కోతపడుతోందన్నమాట.

ఇపుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీపార్టీ (ఎస్పీ) బలం గణనీయంగా పెరుగుతుందని సర్వేలో తేలింది. ఎస్పీ కూటమికి అత్యధికంగా 152 సీట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది. అంటే ఇప్పటికన్నా ఎస్పీ ప్రతిపక్షంలో మరింత బలోపేతమవబోతోందని అర్ధమవుతోంది. ఇక బీఎస్పీ విషయమే మరీ ఇబ్బందిగా మారింది. అత్యధికంగా 14 సీట్లు తెచ్చుకుంటే అదే ఎక్కువన్నట్లుగా వచ్చింది సర్వేలో.

మొన్నటివరకు అధికారంలోకి రాబోయేది తామే అన్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయాదేవి పెద్ద పెద్ద ప్రకటనలే చేశారు. అలాంటి పార్టీ పరిస్ధితి మరీ ఇంత దయనీయంగా ఉందా అనేది ఆశ్చర్యంగా ఉంది. సరే కాంగ్రెస్ కు బలంలో పెరుగుదల ఏమీ లేదు. అప్పుడు 7 సీట్లొచ్చాయి. రేపు కూడా అన్నే సీట్లు వస్తాయని తేలింది. ఇక చిన్నా చితకా పార్టీల సంగతి సర్వేలో ఏమీ తేలలేదు. ఏదేమైనా రైతుల ఉద్యమం బీజేపీ మీద గట్టి దెబ్బే కొట్టబోతోందని అర్ధమవుతోంది. మరి సర్వేలో చెప్పినట్లు 80 సీట్లలో కోత పడుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ పడుతుందా అన్నదే ఆసక్తిగా మారింది.