జగన్ – షర్మిల మధ్య వాదులాట?

మరే మీడియా సంస్థ ప్రస్తావించని అంశాల్ని తన కాలమ్ లో చెప్పే గుణం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణకు అలవాటన్న సంగతి తెలిసిందే. ప్రతి వారాంతంలో తాను రాసే పొలిటికల్ కామెంటరీ ‘కొత్త పలుకు’లో ఆయన పలు సంచలన అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. గత వారం ఆయన తన కాలమ్ లో.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి కడప జిల్లాలోని వైఎస్ కుటుంబానికి చెందిన ఇడుపులపాయ గెస్టు హౌస్ లో ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిల మధ్య గొడవ జరిగినట్లుగా పేర్కొనటం తెలిసిందే. వారి మధ్య వాదులాట జరిగిందని.. ఆస్తికి సంబంధించిన అంశాల మీద ఒకరినొకరు మాటలు అనుకున్నట్లుగా పేర్కొని సంచలంగా మారారు.

అయితే.. ఈ అంశంపై అటు వైసీపీ వర్గీయులు కానీ.. ఇటు షర్మిల వర్గీయులు కానీ ఎవరూ ఏమీ మాట్లాడింది లేదు. ఖండించింది లేదు. ఇలాంటి వేళ.. తాజా కాలమ్ లో ఆర్కే మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు. ఇడుపుల పాయ గెస్ట్ హౌస్ లో అన్నాచెల్లెళ్ల మధ్య జరిగిన మాటల్లో తనకు అందిన విశ్వసనీయ సమాచారాన్ని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన రాసుకున్న కాలమ్ లోని అంశాల్ని యథాతధంగా చూస్తే..

• ఆస్తుల వ్యవహారంతో పాటు రాజకీయపరమైన అంశాలపై సోదరుడు జగన్‌రెడ్డితో షర్మిల ఘర్షణ పడిన విషయం విదితమే. తెలంగాణలో తాను రాజకీయంగా బలపడకుండా సోదరుడు అడ్డుపడుతున్నారని షర్మిల ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. తాను ప్రారంభించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో ముఖ్యనాయకులు చేరకుండా ఆయన తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని షర్మిల ఆగ్రహంగా ఉన్నారు.

• పార్టీని ప్రారంభించక ముందే ఆమెతో చేతులు కలుపుతానని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక మాజీ ఎంపీ హామీ ఇచ్చారు. అయితే జగన్‌రెడ్డి ఆ మాజీ ఎంపీకి ఫోన్‌ చేసి షర్మిల పార్టీలో చేరవద్దని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో సదరు మాజీ ఎంపీ అప్పటి నుంచి షర్మిలకు మొహం చాటేస్తున్నారు. ఇలాగే మరికొందరి విషయంలో కూడా జరిగింది.


• దీంతో అప్పటికే ఆగ్రహంగా ఉన్న షర్మిల, పదిరోజుల క్రితం ఇడుపులపాయ అతిథి గృహంలో సోదరుడు జగన్‌రెడ్డితో గొడవపడ్డారు. ‘‘నాకు అన్యాయం చేస్తే ఆ దేవుడు నీకు కూడా నష్టం చేస్తాడు.. నీవు పోగేసుకున్న సంపద నీకు దక్కకుండా ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని ఆ సందర్భంగా ఆమె సోదరుడికి శాపనార్థాలు పెట్టినట్టు తెలిసింది.


• ‘తెలంగాణలో నేను రాజకీయంగా బలపడకుండా అడ్డుకుంటావా? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నిన్ను కూడా బలహీనపరుస్తాను’’ అని సోదరుడిని హెచ్చరించినట్టు సమాచారం. జగన్‌రెడ్డి గురించి తెలిసిన రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులెవరూ అతడిని ఎదిరించి మాట్లాడరు. షర్మిల మాత్రం అందుకు విరుద్ధంగా సోదరుడి మొహం మీదే తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కారు.


• ఘర్షణ అనంతరం తల్లి విజయమ్మను వెంటబెట్టుకుని రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించిన షర్మిల, అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయారు