జగన్ కు అమూల్ షాక్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమూల్ పెద్ద షాకే ఇచ్చింది. సహకారరంగంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు సంస్ధ అమూల్ కు ఏపీలో జగన్ చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. పాల సేకరణ, రవాణా, ఉత్పత్తుల తయారీ లాంటి అంశాల్లో అమూల్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. అమూల్ సంస్ధతో మహళా స్వయం సమృద్ధి సంఘాలను టైఅప్ కూడా చేసింది. అమూల్ తో పాటు మహిళా సంఘాలు ఎదగటానికి జగన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.

సీన్ కట్ చేస్తే కొత్తగా ఏర్పాటు చేయాలని అనుకున్న ప్లాంటును అమూల్ యాజమాన్యం తెలంగాణాలో ఏర్పాటు చేస్తోంది. తమకు బిజినెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏపీని వదిలేసి అమూల్ యాజమాన్యం తెలంగాణాలో ప్లాంటు ఏర్పాటు చేయటమే విచిత్రంగా ఉంది. రోజుకు 5 లక్షల లీటర్ల చిల్లింగ్ కెపాసిటి తో ప్లాంటును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణా ప్రభుత్వంతో యాజమాన్యం ఒప్పందం కూడా చేసుకుంది.

ఇపుడు చేసుకున్న ఒప్పందం విలువ రు. 500 కోట్లని యాజమాన్యం ప్రకటించింది. భవిష్యత్తులో ఈ ప్లాంటును 10 లక్షల లీటర్ల చిల్లింగ్ కెపాసిటికి పెంచే యోచన కూడా ఉందట. 18-24 నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం టార్గెట్ గా పెట్టుకున్నది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది. ఈ ప్లాంటులో బ్రెడ్డు, బిస్కెట్లు, స్నాకులు, ఐస్ క్రీములు తదితరాలు ఉత్పత్తవుతాయి.

అంతా బాగానే ఉంది కానీ తమకు ప్రోత్సాహమిస్తున్న ఏపీని కాదని పెట్టుబడులు పెట్టడానికి అమూల్ యాజమాన్యం తెలంగాణాను ఎందుకు ఎంచుకున్నది అన్నదే అర్ధం కావటంలేదు. తెలంగాణాలో పెట్టే పెట్టుబడే ఏపిలో పెట్టుంటే తమతో పాటు రాష్ట్రానికి కూడా మేలు జరిగేది. కానీ ఆపని చేయటం లేదంటే ఏపి విషయంలో ఎక్కడైనా యాజమాన్యంలో అసంతృప్తిగా ఉందా అనే అనుమానం మొదలైంది.

వేలాది పాల ఉత్పత్తిదారుల సంఘాలను, మహిళా సమాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమూల్ తో ఒప్పందాలు చేయించింది. పాలను సేకరించి అందిస్తోంది కూడా. అయినా పెట్టుబడికి తెలంగాణాను ఎంచుకుందంటే ఏపిలో ఎక్కడో పొరబాటు జరుగుతోందనే అనుకోవాలి.