లారీల్ని బస్సులుగా మార్చేసి తిప్పుతున్న జేసీ బ్రదర్స్..!

సీనియర్ రాజకీయ నాయకుడిగా సుపరిచితుడైన జేసీ బ్రదర్స్.. వాహన వ్యాపారాల వ్యాపార లోగుట్టు బయటకు వచ్చింది. ఇటీవల కాలంలో వారు చేసే వ్యాపారాలకు సంబంధించి కళ్లు చెదిరే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఏపీ రవాణా శాఖ అధికారుల పుణ్యమా అని.. మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. దీంతో.. వారిపై ఏకంగా ఇరవై నాలుగు కేసులు బుక్ చేశారు.

జేసీవారి వ్యాపారం గురించి వింటే.. అంత పెద్ద నాయకుడి ఆలోచనలు ఇంత చిన్నగా ఉంటాయా? అన్న భావన కలుగక మనదు. బీఎస్ -3 వాహనాల్ని బీఎస్-4గా చూపించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించటాన్ని ఒక ఎత్తు అయితే..లారీల్ని కొనుగోలు చేసి వాటిని బస్సులుగా మార్చి తిప్పుతున్న వైనం తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

ఇలా చెప్పుకుంటే జేసీ వారి వ్యాపార అక్రమ లీలలు కళ్లు తిరిగేలా ఉన్నాయి. వారి అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది తాజాగా రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అశోక్ లేలాండ్ తయారు చేసిన బీఎస్-3 లారీల్ని తుక్కు కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం.. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన వాటిని ఎలా మారుస్తారన్నది తాజా లెక్కలతో సహా బయటకు వచ్చాయి.

98 లారీల్ని నాగాలాండ్ లో.. 32 లారీల్ని ఏపీలో.. మరో 24 లారీల్ని తమిళనాడు.. ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లారీల్లో 101 లారీలు ఏపీలో.. 33 కర్ణాటకలో.. 15 తెలంగాణలో.. తమిళనాడు.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లారీల ఆచూకీ లభించాల్సి ఉంది. నాలుగు లారీల్ని బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీల్ని బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించారు.

జేసీ అక్రమాలు ఆధారాలతో సహా లభించటంతో వారి లారీల్ని జాతీయ వాహన డేటా బేస్ నుంచి తొలగించారు. దీంతో వాటిని అమ్మే అవకాశం లేకుండా పోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లారీలకు తీసుకున్న బీమా పత్రాలు కూడా నకిలీవేనన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన లారీల్ని వేర్వేరు వారికి అమ్మేసిన వైనం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో జేసీకి చెందిన జటాధర కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. లాభాల కోసం వ్యాపారాలు చేయటం మామూలే. కానీ.. మరీ ఇంత కక్కుర్తి ఏంది జేసీ సాబ్?