ఇంకొక్క ఏడాదే జ‌గ‌న్ పాల‌న‌

విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న బీజేపీ ప్రజాగ్ర‌హ స‌భ‌లో ఆ పార్టీ నేత‌లు ఏపీ స‌ర్కారుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కుడు, తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ శార‌దా పీఠం అధిప‌తి ప‌రిపూర్ణానంద స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2022 చివర్లో కానీ.. 2023 మొదట్లోనే వైసీపీ పాలన పోతుందన్నారు. జ‌గ‌న్‌కు శంక‌రగిరి మాన్యాలు త‌ప్పేలా లేవ‌ని వ్యాఖ్యానించారు. 2022 జనవరి తర్వాత ఏపీలో వేసే ప్రతి అడుగు..  2024లో బీజేపీని అధికారంలోకి తెప్పిస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

బొట్టు పెట్టుకునేందుకు జంకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హిందువనని నమ్మించ‌డం ఎందుక‌ని ప‌రిపూర్ణానంద ప్ర‌శ్నించారు. అంతర్వేది లో రథాన్ని కాల్చేస్తే ఓ మంత్రి చెక్కేక‌దా! అని హేళనగా మాట్లాడాడని, అది సంస్కారమా? అని ప్రశ్నించారు. దేవాలయాల్లోని డబ్బులన్నీ ఆవిరైపోతున్నాయని పరిపూర్ణానంద  ఆగ్రహం వ్యక్తం చేశారు.  

‘‘విజయవాడలో 42 గుడుల‌ను గతంలో కూల్చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క ఆలయానికైనా శంకుస్ధాపన చేసిందా?. ఏపీలో మహానేత ఎన్‌టీఆర్. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఅర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకున్నారు కాని 2018లో ఆయన సిద్ధాంతాలను చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ల కింద పెట్టారు. అందుకే చంద్రబాబు 2019లో ఓడిపోయారు. జగన్ తెలుగు భాషను జెరూసలేంలో తాకట్టు పెట్టారు. జగన్ పిల్లలు లండన్‌లో చదువుతున్నారు. లండన్ విద్యాల‌యాల్లో మొదట వేద మంత్రాలు చదివిస్తారు. ఆ విష‌యాన్ని జగన్ తెలుసుకోవాలి. ఏపీకి చంద్రబాబు, జగన్ ఇద్దరూ అన్యాయం చేశారు’’ అని పరిపూర్ణానంద స్వామి చెప్పారు.

బీజేపీ శ్రేణులు రెండేళ్లు కష్టపడితేనే ఏపీలో కాషాయం జెండా ఎగురవేయొచ్చని పరిపూర్ణానంద స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీని ఏపీ ప్రజలు పక్కన పెట్టేశారని, వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచేశారని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 350 సీట్లతో మళ్ళీ అధికారం చేపడుతుంది. గుర్తు పెట్టుకో అసదుద్దీన్.. మోడీ, యోగి కలసి మీ అన్నదమ్ముల ఢంకా మోగిస్తారు. మీకోసం ఢిల్లీ నుండి వస్తారు చూస్తూ వుండండి. ఏపీలో బిజెపి అధికారంలోకి వస్తే గుడిసెలను బంగ్లాలుగా మారుస్తాం. బీజేపీ శ్రేణులంతా నగరాలు వీడి పల్లెల్లో తిరగాలి. రాష్ట్రాన్ని మనందరం కలిసి కాపాడుకోవాలి. బీజేపీ అధికారంలోకి వస్తేనే అందరి తలరాతలు మారతాయి.’’ అని పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు.