ట్రోలింగ్ ఎఫెక్ట్… రేవంత్ కి సారీ చెప్పిన పోసాని

టీ పీసీసీ కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సారీ చెప్పక తప్పలేదు. ఆ సారీ కూడా ఏదో అలా సారీ అని చెప్పేసి సర్దుకోవడం కాకుండా రేవంత్ తో పాటు ఆయన అభిమానులకు కూడా సారీ చెప్పేసిన పోసాని… అసలు తాను రేవంత్ గురించి మాట్లాడనే లేదని, అయినా కూడా తనపై జరుగుతున్న ట్రోలింగ్ నేపథ్యంలోనే బాధ్యత కలిగిన వ్యక్తిగా రేవంత్ కూ, ఆయన అభిమానులకు సారీ చెబుతున్నట్లుగా ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిని తన తప్పుగానే భావించి… ఆ తప్పును సరిదిద్దుకుంటానని కూడా పోసాని ప్రకటించారు. మొత్తంగా తనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని రేవంత్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిన పోసాని… సారీ చెప్పేయడంతో ఈ వివాదం ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జవ్వాడలోని కేటీఆర్ ఫాం హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చాలా కాలం నుంచి ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు. తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోలకు జవ్వాడ ఫాం హౌస్ ఉందని రేవంత్ వాదిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో టీ పీసీసీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై రేవంత్ రెడ్డి జాతీయ హరిత ట్రిబ్యూనల్ ( ఎన్జీటీ )ను ఆశ్రయించడం, కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు జారీ కావడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కిందనే చెప్పాలి. ఎన్జీటీ నోటీసులు జారీ కాగానే… ఎంట్రీ ఇచ్చిన రేవంత్.. తన వాదన కరెక్టేనని తేలిందని, కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని రేవంత్ డిమాండ్ చేశారు. సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన పోసాని.. కేటీఆర్ ను వెనకేసుకుని వచ్చి చాలానే మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన విషయాన్ని కూడా పోసాని ప్రస్తావించారు. అంతేకాకుండా విపక్షం విమర్శ చేసేటప్పుడు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుందని కూడా పోసాని తనదైన శైలిలో రెచ్చిపోయారు.

ఆ వెంటనే రంగంలోకి దిగిపోయిన రేవంత్ అభిమానులు పోసానిని సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకోవడం మొదలెట్టారు. ఈ ట్రోలింగ్ అంతకంతకూ పెరిగిపోవడంతో పోసాని నిజంగానే కంగారు పడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా ట్రోలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేద్దామన్న ఉద్దేశ్యంతో ఎంట్రీ ఇచ్చిన పోసాని… ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో పోసాని ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘నాకు తెలిసి గానీ, తెలియక గానీ నా లైఫ్ లో రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా గానీ, రాజకీయ పరంగా గానీ ఎప్పుడూ కామెంట్ చేయలేదు. ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుందని మాత్రమే అన్నాను. రేవంత్ రెడ్డి గురించి నేను అసలు మాట్లాడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో బాగా ట్రోల్ అవుతున్నాయి కాబట్టి.. ఇది నా బాధ్యతగా తీసుకుని రేవంత్ రెడ్డికి, ఆయన అభిమానులకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును సరిదిద్దుకుంటాను’’ అని పోసాని క్షమాపణలు చెప్పేశారు.