సంబ‌రాల‌కు సై.. ఏపీలో అధికారిక ప్ర‌క‌ట‌న‌

ఈ నెల 21న(మంగ‌ళ‌వారం) ముఖ్యమంత్రి జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు చేసుకునేందుకు వీలుగా.. ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన ప్ర‌బుత్వం.. ఎట్ట‌కేల‌కు సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం.. పార్టీ శ్రేణులు.. జ‌గ‌న్‌పుట్టిన‌ రోజును ఘ‌నంగా నిర్వ‌హించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు.

అదేస‌మ‌యంలో సీఎం జగన్ వీరాభిమాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా పాటలను సిద్దం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు పాటల వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జ‌గ‌న్ పుట్టిన‌రోజు వేడుక‌లు నిర్వ‌హించుకుంటామ‌ని.. కోరుతున్నాయ‌ని.. అయితే.. రాష్ట్రం ఉన్న ప‌రిస్థితిలో భారీ ఎత్తున చేయొద్ద‌ని ముందుగా భావించామ‌ని.. అయితే.. ప్ర‌జ‌ల నుంచి కూడా ఒత్తిడి రావ‌డంతో సీఎం జ‌గ‌న్ సంబ‌రాల‌కు అంగీక‌రించార‌ని స‌జ్జ‌ల వ్యాఖ్య‌నించారు.

అయితే.. సంబ‌రాల‌ను గౌర‌వంగా.. సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలోనేజ‌రుపుకోవాల‌ని సీఎం సూచించిన‌ట్టు తెలిపారు. ఎవ‌రూ మ‌ద్యం తాగి చిందులు వేయ‌డం.. డీజే నృత్యాలు చేయ‌డం వంటివి చేసి.. కేసుల వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌న్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విమ‌ర్శ‌లు కూడా చేయొద్ద‌ని.. కేవలం సీఎం జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డిన తీరు, పాద‌యాత్ర‌, ఆయ‌న జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌తోపాటు.. ఈ రెండేళ్ల పాల‌న‌పై జ‌గ‌న్ ఎలాంటి శ్ర‌ద్ధ తీసుకున్నారు.. సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ప‌థ‌కాలు.. పేద‌ల‌కు ఎలాంటి ల‌బ్ధి చేకూరుతోంది.. వంటి కీల‌క విష‌యాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. వారి ఆశీర్వాదం.. జ‌గ‌న్‌కు అందేలా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. స‌జ్జ‌ల కోరారు. మొత్తానికి వైసీపీ నేత‌లు.. ఎదురు చూస్తున్న జ‌గ‌న్ సంబ‌రాల‌కు ప్ర‌బుత్వ‌మే ఆఫ్‌ది రికార్డుగా ప‌చ్చ‌జెండా ఊప‌డంతో శ్రేణులు ఎలా రెచ్చిపోతాయో చూడాలి.