సీపీఎస్ రద్దు విషయమై జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇపుడు చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని చేసిన హామీని ఉద్యోగులు నమ్మారు. సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రెండున్నరేళ్ళయ్యింది. ఇపుడు ఉద్యోగ సంఘాలు పీఆర్సీ, సీపీఎస్ రద్దు, డీఏ తదితరాల కోసం ఆందోళనలు మొదలుపెట్టింది.
చావుకబురు చల్లగా చెప్పినట్లుగా సీపీఎస్ రద్దు చేయటంలో సాంకేతిక సమస్యలున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇపుడు చెబుతున్నారు. సీపీఎస్ రద్దులో సాంకేతిక సమస్యలు ఉంటాయని అప్పట్లో జగన్ కు తెలీదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తే పెన్షన్లకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని చాలా చల్లగా చెప్పారు. అంటే సజ్జల చెప్పిన ప్రకారం చూస్తే సీపీఎస్ రద్దు లేనట్లే అని అర్ధమైపోతోంది. లక్షలాదిమంది ఉద్యోగులకు సమస్యలపై హామీ ఇచ్చే ముందు ఎలాంటి అధ్యయనం చేయకుండానే హామీ ఇచ్చేస్తారా ?
ప్రతిపక్షంలో ఉన్నపుడు హామీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కప్పుడు తెలీదంటే ఉద్యోగులు ఒప్పుకుంటారా ? హామీలిచ్చి తర్వాత తుంగలో తొక్కేయటంలో మిగతా నాయకుల సరసన జగన్ కూడా చేరిపోయారు. అవసరానికి హామీలివ్వటం అవసరం తీరిపోయిన తర్వాత వాటిని పట్టించుకోకపోరనే అపఖ్యాతి వచ్చిన తర్వాత జనాలు ఎవరినైనా ఎందుకు నమ్ముతారు ? అసలు హామీలిచ్చేటపుడే అన్ని కోణాల్లోను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.
ఇచ్చిన పది హామీల్లో ఒక్కటి అమలు చేయకపోయినా జనాలు దాన్నే పట్టుకుంటారు. అందులోను లక్షలాది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న సీపీఎస్ రద్దు లాంటి కీలకమైన హామీ నుండి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటోందంటే అది ఎంత అవమానం. ఇదే ఉద్యోగులు జగన్ను ఎందుకు నమ్మాలో చెప్పమని నిలదీస్తే సజ్జల ఏమని సమాధానం చెబుతారు ? రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇచ్చే హామీలను జనాలు నమ్మకపోతే తప్పు జగన్ దే అవుతుంది. మాట తప్పను మడమ తిప్పనని గొప్పగా చెప్పుకోవటం కాదు ఆచరణలో చూపించాలి.
కాపులకు రిజర్వేషన్ అంశంపై 2019 ఎన్నికల సందర్భంగా జగన్ చాలా స్పష్టంగా సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో కాపుల్లో ఎవరు కూడా జగన్ పై ఆశలు పెట్టుకోలేదు. అయితే అవుతుంది లేకపోతే కాదని చెప్పేయటమే మంచిది. కొందరికి నచ్చకపోయినా చివరకు జనాలు నిజాయితీని అంగీకరిస్తారు. హామీలిచ్చి తప్పటంలో ఇతర నేతలకు ఉన్న మైనస్సే ఇపుడు జగన్ కు కూడా చుట్టుకుంటోంది. రాజకీయంగా మాటిచ్చి తప్పినా అది వ్యక్తులకు మాత్రమే పరిమితమవుతుంది. కానీ ఉద్యోగులు, జనాల విషయంలో అలా జరిగితే అది లక్షలాదిమంది మీద ఎఫెక్టు చూపుతుంది. కాబట్టే హమీలిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates