ఎన్టీఆర్ వ‌ర్సిటీ వివాదం.. 400కోట్లు ఎక్కడ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ నిధుల మ‌ళ్లింపు వివాదం ఎలాంటి మ‌లుపు తీసుకోనుందో ఈ రోజు తేలే అవ‌కాశం ఉంది. ఈ యూనివ‌ర్సిటీకి చెందిన నిధుల‌ను ప్ర‌భుత్వం తీసుకోవ‌డాన్ని నిర‌సిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు కొన్ని రోజుల‌గా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న‌ల కార‌ణంగా ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఆందోళ‌న‌కు ఒక ముగింపు ఇచ్చే దిశ‌గా ఉద్యోగులు, విద్యార్థుల‌తో చ‌ర్చించాల‌ని వీసీ, రిజిస్ట్రార్ నిర్ణ‌యించారు.

వాళ్ల‌ను సోమ‌వారం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు. ఈ చ‌ర్చ‌ల్లో ఏదో ఓ విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయా? లేదా నిధుల‌ను వెన‌క్కి తెచ్చే విష‌యంపై ఏదైనా హామీ ల‌భిస్తుందా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ కార్య‌కాలాపాలు సాగాల‌న్నా ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వాల‌న్నా సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందాల‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పు చేయాల్సిందే. ఇప్ప‌టికే ఏపీ అప్పు రూ.7 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మేమో అన్ని విధాలుగా ఖ‌జానాలోకి డ‌బ్బులు స‌మ‌కూర్చ‌డంపై దృష్టి పెట్టింది.

ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి చెందిన రూ.400 కోట్లు గ‌త నెల‌లో ప్ర‌భుత్వ చేతుల్లోకి వెళ్లాయి. ప్ర‌భుత్వ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ కార్పొరేష‌న్‌లోకి డ‌బ్బుల బ‌దిలీ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇదంతా జ‌గ‌న్ ఆదేశాల‌తో వీసీ డా.పి.శ్యామ్‌ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. విశ్వ‌విద్యాల‌య అభివృద్ధి కోసం నిధులు రూ.448 కోట్లు క‌ష్ట‌ప‌డి కూడ‌బెట్టామ‌ని, వీటిలో రూ.400 కోట్ల‌ను ప్ర‌భుత్వ కొత్త సంస్థ‌కు వీసీ ఏక‌ప‌క్షంగా బ‌దిలీ చేశార‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వీసీకి వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. దీంతో స్నాత‌కోత్స‌వంతో పాటు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు.

ప్ర‌భుత్వం వెంట‌నే నిధులు తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. యూనివ‌ర్సిటీలో రోజువారీ ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బుల్లేని దుస్థితి వ‌చ్చింద‌ని, 150 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని వాళ్లు వాపోతున్నారు. మ‌రోవైపు వీసీ మాత్రం ఇది త‌న‌ బాస్ ఆజ్ణ అని ఆయ‌న చెప్పిన‌ట్లు చేయ‌డ‌మే త‌న ప‌ని అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. దీంతో సోమ‌వారం నుంచి ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని ఉద్యోగులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆందోళ‌న చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థుల‌ను చ‌ర్చ‌ల‌కు వీసీ ఆహ్వానించారు.