జగన్ చేస్తున్నది తప్పన్న అగ్ర నిర్మాత

కరోనా ధాటికి బాగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. లాక్ డౌన్ టైంలో నెలల తరబడి థియేటర్లు షట్ డౌన్ అయ్యాయి. అలాగే సినీ కార్యకలాపాలు కూడా చాన్నాళ్ల పాటు ఆగిపోయాయి. దీంతో పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. థియేటర్ ఇండస్ట్రీ ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ దెబ్బను తట్టుకోవడమే కష్టం అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం.. బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దు చేయడం.. చాన్నాళ్ల పాటు కర్ఫ్యూ పేరుతో నిర్ణీత షోలు కూడా తగ్గించడంతో ఎగ్జిబిటర్లకు కష్టాలు తప్పలేదు.

ఆ ప్రభావం ఇండస్ట్రీ మీద గట్టిగానే పడింది. ఆంధ్రాలో వసూళ్లు పడిపోయి.. ఇప్పుడు బిజినెస్ డీల్స్ కూడా రివైజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిత్యావసరాలు సహా అన్ని ధరలూ పెరుగుతుండగా.. పట్టుబట్టి టికెట్ల రేట్లను తగ్గించి దశాబ్దం కిందటి ధరలను అమలు చేస్తుండటంతో నిర్మాతల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కానీ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించడానికి, ఈ విషయంలో డిమాండ్లు చేయడానికి ఇండస్ట్రీ పెద్దలు భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్, సురేష్ బాబు లాంటి ఒకరిద్దరు మాత్రమే ఈ విషయంలో గట్టిగా మాట్లాడగలిగారు.

ఐతే రోజు రోజుకూ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుండటంతో టికెట్ల ధరల విషయంలో పునరాలోచించాలంటూ నిర్మాతలు సున్నితంగానే స్పందిస్తున్నారు. విన్నపాలు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ ఈ విషయమై స్పందించారు. ఏపీలో సమస్య తీవ్రంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ‘‘తెలంగాణలో రేట్లు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగా లేదు. దేశం అంతా ఒక వైపు పోతోంటే మనం ఇంకో వైపు పోలేం కదా.

కచ్చితంగా రేట్లు పెంచాల్సిందే. మన దగ్గర ఉన్న థియేటర్లు దేశం ఎక్కడా లేవు. టికెట్ రేట్లను మరీ ఇంత తక్కువగా తగ్గించడంతో నిర్మాతలకు కష్టంగా మారింది’’ అని నారాయణదాస్ అన్నారు. ఐతే వ్యక్తిగతంగా ఇలా ఎవరికి వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని.. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడమో.. లేదంటే కోర్టుకు వెళ్తేనో తప్ప సమస్య పరిష్కారం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.