కేంద్రంపై కేసీయార్ యుద్ధమైపోయినట్లేనా ?

కేంద్రం మీద యుద్ధమన్నారు.. ఆకాశం బద్దలైపోతుందన్నారు. జనాలంతా నిజమే అనుకుంటే తీరా ఇంకేదో అయ్యింది. వరికి ప్రత్యామ్నాయ పంటలుగా వేరుశెనగ, పత్తి, మినుములు, పెసర, శనగల్లాంటి పంటలపై రైతులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీయార్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి రైతులతో ముచ్చట్లాడారు. సంవత్సరమంతా వరి వేసి ఇబ్బందులు పడే బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును కూడా ఆలోచించాలన్నారు.

వరి కొనుగోలు విషయంలో కేంద్రంపై కేసీయార్ నోటికొచ్చినట్లు విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా పండిన వరిని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదో చూస్తానంటూ రంకెలేశారు. తెలంగాణలో వరిని కేంద్రం కొనుగోలు చేసి తీరాల్సిందే అంటూ తీవ్రంగానే వార్నింగ్ ఇచ్చారు. కేసీయార్ వార్నింగుపై  కేంద్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వక పోయేసరికి మంత్రులు, నేతల బృందాన్ని వేసుకుని ఏకంగా ఢిల్లీకే వెళ్ళిపోయారు.

అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు. మూడు రోజులు ఢిల్లీలోనే కేసీయార్ వెయిట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని కేసీయార్ చివరకు హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. కేంద్రమేమో రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించేసింది. ఇదే సమయంలో కేసీయార్ మాత్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అంటు పట్టుబట్టారు.

వరి రాజకీయంపై దాదాపు పది రోజులు కేసీయార్-బీజేపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. బాయిల్డ్ రైస్ ను తెలంగాణా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు నానా రచ్చచేశారు. కేంద్రం తెలంగాణాపై  సవతి తల్లి ప్రేమను కురిపిస్తోందంటు కేసీయార్ అండ్ కో నానా గోల చేశారు. ఇదే సమయంలో కేసీయార్ ను టార్గెట్ చేస్తు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో ఇందిరాపార్క్ దగ్గర  పెద్ద సీనే క్రియేట్ చేశారు.

వరి చుట్టూ పెద్ద రాజకీయమే నడవటంతో తెలంగాణలో ఏదో జరగబోతోందనే అనుకున్నారు. తీరా చూస్తే వరికి ప్రత్యామ్నాయ పంటలను వేయాలని కేసీయార్ రైతులకు  చెప్పటంతో కేంద్రం మీద యుద్ధం అయిపోయినట్లే అనిపిస్తోంది. ఇంతోటి దానికి రైతులను రెచ్చగొట్టడం, యుద్ధమని ప్రకటించటం, ఇందిరా పార్కు దగ్గర స్వయంగా కేసీయారే దీక్ష చేయటం, అపాయిట్మెంట్ లేకపోయినా ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు కూర్చోవడం లాంటివి ఎందుకు చేసినట్లో ఎవరికీ అర్థం కావడం లేదు.