కర్ణాటకకు మళ్లీ కొత్త సీఎం ?

కర్ణాటక రాష్ట్రం బీజేపీకి ఏమాత్రం అచ్చి వచ్చినట్లు లేదు. అధికారంలో ఉన్నారన్న మాటే కానీ ముఖ్యమంత్రి కుర్చీ మ్యూజికల్ ఛైర్ లాగ తయారైపోయింది. ఎప్పుడెవరు సీఎంగా ఉంటారో ? ఎంతకాలం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారో ఎవరు చెప్పలేకపోతున్నారు. కర్నాటక పరిస్ధితి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయినట్లు తయారైపోయింది. ఇపుడిదంతా ఎందుకంటే కర్నాటకలో తొందరలోనే సీఎం మారబోతున్నారట.

ఈమధ్యనే బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. బీఎస్ యడ్యూరప్పను దించేసి అతికష్టం మీద బొమ్మైని బీజేపీ అగ్రనాయకత్వం సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. బస్వారజ బొమ్మై మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప పెద్ద బాంబే పేల్చారు. తొందరలోనే బొమ్మై స్ధానంలో మురుగేష్ నిరానీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. మురుగేష్ నిరాసీ కూడా బొమ్మై మంత్రివర్గంలో సభ్యుడే.

నిరానీ కూడా యడ్యూరప్ప స్ధానంలో సీఎం అవటానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే సామాజికవర్గాల కూర్పు, సీనియారిటి తదితర అంశాలను అనేకం బేరీజు వేసుకున్న తర్వాత చివరకు బొమ్మైనే సీఎం కుర్చీలో మోడి, అమిత్ షా కూర్చోబెట్టారు. నిజానికి బొమ్మై సీఎం అవటం మంత్రుల్లోనే చాలామందికి ఏమాత్రం ఇష్టంలేదు. అయితే స్వయంగా మోడి, షా గట్టిగా చెప్పటంతో వేరే దారిలేక అప్పట్లో కామ్ గా కూర్చున్నారు.

సీనియర్ మంత్రుల్లోని కొందరితో అప్పట్లో అగ్రనేతల తరపున దూతలుగా వచ్చిన నేతలు ఏమి చెప్పి నోరు మూయించారో  ఎవరికీ తెలీదు. అయితే బొమ్మై సీఎం కుర్చీలో కూర్చుని రెండు నెలలు కాకుండానే తొందరలోనే ముఖ్యమంత్రి మార్పని బాహాటంగానే సీనియర్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చెప్పటమంటే మామూలు విషయం కాదు. తొందరలోనే సీఎంను మార్చబోతున్నారంటు ఓ మంత్రి బాహాటంగానే చెప్పారంటే తెరవెనుక పావులు ఎంత వేగంగా కదులుతున్నాయో అర్థం కావటంలేదు.

కాబోయే సీఎం నిరానీయే అని ఆయనకు అన్నీ అర్హతులున్నట్లు ఈశ్వరప్ప చెప్పారు. అంటే ముందునుండే నిరానీకి ఈశ్వరప్ప గట్టి మద్దతుదారుగా మారిపోయినట్లు అర్ధమవుతోంది. పైగా వెనుకబడిన తరగతుల వర్గాల సంక్షేమం కోసమే సీఎం మార్పుండబోతోందన్నారు. ఇంత చెప్పిన ఈశ్వరప్ప ఆ ముచ్చట ఎప్పుడన్న విషయం తనకు తెలియదని సస్పెన్సులోనే ఉంచేశారు.