కేజ్రీవాల్ ది తెలివైన నిర్ణయమేనా ?

పంజాబ్ విషయంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై సానుకూల స్పందన కనబడుతోంది. పంజాబ్ పర్యటనలో కేజ్రీవాల్ మాట్లాడుతు తాను రెడీ అంటే ఇప్పటికప్పుడు ఆప్ లో చేరటానికి 25 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారంటు చెప్పిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏలే కాకుండా 3 ఎంపీలు కూడా ఆప్ లో చేరుతామని అడుగుతున్నారట. అయితే అలాంటి చెత్తను తాను తమ పార్టీలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలను ఆప్ లోకి చేర్చుకోకూడదని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని విశ్లేషకులంటున్నారు. గడచిన ఆరుమాసాలుగా పంజాబ్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ జరుగుతున్న పరిణామాలతో పార్టీ జనాల్లో బాగా పలుచనైపోయింది. పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రభుత్వాన్ని బాగా గబ్బు పట్టించేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల్లాగ సిద్ధూ సొంతపార్టీ ప్రభుత్వాన్నే రోజుకో తీరుతో నిలదీస్తు రోడ్డున పడేస్తున్నారు.

రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మామూలు జనాల్లో అలాంటి నమ్మకమేమీ కనబడటంలేదు. ఇందులో భాగంగానే ప్రీపోల్ సర్వేల్లో సింగిల్ లార్జెస్టుపార్టీగా ఆప్ నిలుస్తుందని తేలింది. మొత్తం 117 సీట్లలో ఆప్ కు 51 సీట్లు వస్తాయని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. సర్వే రిపోర్టులు ప్రతిసారి నిజమవ్వాలని ఏమీలేదు. కానీ పంజాబ్ లో పరిస్ధితులు చూసిన తర్వాత మామూలు జనాల్లో కూడా ఆప్ పైనే దృష్టి ఉందని ఎప్పటినుండో అనుకుంటున్నారు.

అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణల కారణంగా జనాల్లో కాంగ్రెస్ పలుచనైపోయింది. ఇదే సమయంలో బీజేపీని జనాలు పట్టించుకోవటంలేదు. ఇక శిరోమణి అకాలీదళ్ కూడా జనాల్లో పెద్దగా పుంజుకోలేదు. ఈ కారణంగానే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా 20 సీట్లతో ఉన్న ఆప్ రేపటి ఎన్నికల్లో బాగా పుంజుకుంటుందనే మొదటినుండి జనాల్లో అభిప్రాయముంది. ప్రీపోల్ సర్వే తర్వాత ఆప్ విషయంలో జనాల్లో సానుకూలత పెరుగుతోందనే విషయం అర్ధమవుతోంది.

ఇలాంటి నేపధ్యంలోనే కాంగ్రెస్ ఎంఎల్ఏలను తన పార్టీలో చేర్చుకునే ఉద్దేశ్యంలో లేమని కేజ్రీవాల్ చెప్పి మంచిపని చేశారు. అందుకనే సొంతంగానే 117 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఆప్ ఎంఎల్ఏలు బాగానే పనిచేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో ఉందట. కాబట్టి ఆప్ రేపటి ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.