నేనేంటో ఇక చూపిస్తా.. మరో ఉద్యమానికి కోమటిరెడ్డి శ్రీకారం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కాక రేపుతున్నారు. ఆ పార్టీకి ఆయన కంట్లో నలుసుగా తయారయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కోమటిరెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించారు. అయితే ఆ స్థానాన్ని అధిష్టానం రేవంత్ రెడ్డితో భర్తీ చేసింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి ఎడమొఖం పెడ ముఖంగా ఉన్నారు. ఆయన ఊరికే ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ పార్టీ నిర్ణయాలు తప్పుబడుతూ వస్తున్నారు. కోమటిరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ ను ఇబ్బందుల్లో నెట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ అంటే తనకు ప్రాణమని అంటూనే పార్టీ నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటునే.. సీఎల్పీ కార్యాలయాలన్ని కార్యక్షేత్రంగా మార్చుకుంటున్నారు. అక్కడి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

శనివారం కోమటిరెడ్డి, సీఎల్సీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెడుతానని ప్రకటించారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటే తనకు ప్రాణమని, సోనియా గాంధీ తన దేవత అని ప్రకటించారు. తమ పార్టీ నేతలే అప్పుడు దయ్యం, ఇప్పుడు దేవత అంటున్నారని తప్పుబట్టారు. 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్య మంత్రుల పదవులు పంపకాలు చేసుకున్నారని విమర్శించారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారని విమర్శించారు. తాను జిల్లా నాయకుడినని, వాళ్లంతా గొప్ప నేతలని ఎద్దేవాచేశారు.

ఏపీలో కాంగ్రెస్ లేదనుకున్న చోటే బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బ‌ఘేల్ ని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించారు.

కొంతకాలంగా అధిష్టానంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఠాగూర్, టీపీసీసీ పదవిని డబ్బు తీసుకుని అమ్ముకున్నాని ఆరోపించారు. ఈ తర్వాత ఆవేశంలో అలా మాట్లాడడని వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఠాగూర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటివరకు కోమటిరెడ్డితో ఠాగూర్ మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఆయనను కలిసిందుకు కోమటిరెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఠాగూర్ ససేమిరా అంటున్నారట. ఈ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోమటిరెడ్డిని బుజ్జగించే బాధ్యతను సీనియర్ నేత వి.హనుమంతరావుకు అప్పగించినట్లు తెలుస్తోంది.