కేసీఆర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది: అనిల్

దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథాకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఈ పథకాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. తెలంగాణలో అన్ని పార్టీల నేతలు దళిత బంధు పథాకాన్ని స్వాగతించారు. అయితే అమలుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్‌అని కూడా విమర్శించారు. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో కొంత మేరకు అమలు చేసినప్పటికి.. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎన్నికల సంఘం తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని చేపట్టిన తర్వాత ఏపీలో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించాలని అనేక వినతులు వస్తున్నాయి తెలిపారు. “కేసీఆర్ గారు ఇక్కడ కూడా పార్టీని పెట్టండి. మిమ్మల్ని గెలిపించడానికి మేం రెడీగా ఉన్నాం. మాకు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావాలి” అని ఏపీ నుంచి అనేక మంది కోరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని సమైక్య పాలకులు చెప్పారని, ఇప్పుడు అదే ఏపీలో కరెంటు లేదని, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉందని ప్రకటించారు. కేసీఆర్ ప్రకటన ఏపీలో కాక రేపుతోంది.

కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌కుమార్ స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తున్నామని కేసీఆర్‌కు అనిల్ జవాబిచ్చారు. తెలంగాణలో దళిత బంధును హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు. “తెలంగాణలో ఉన్న సంక్షేమం ఏపీ ఉన్న సక్షేమాన్ని పోల్చుకుందామా? తెలంగాణలో అమ్మఒడి ఉందా? ఏడాదికి రూ. 6500 కోట్లు ఖర్చుతో అమ్మఒడి అమలు చేస్తున్నాము. సంవత్సరానికి రూ. 6500 కోట్లుతో అమలు చేస్తున్న ఆసరాపథకం ఉందా? నాడు నేడు కింద స్నూళ్లను అభివృద్ది చేస్తున్నాం” అని మంత్రి అనిల్ వివరించారు.

ఎన్నికల స్టంట్ లో భాగంగానే కేసీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఎక్కడైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ కేసీఆర్‌కు ఉందని గుర్తుచేశారు. ఏపీలో కూడా పార్టీ పెట్టుకోవచ్చు.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అనిల్ చెప్పారు. కేసీఆర్ చెబుతున్నట్లు ఏపీలో కరెంటు కోతలు లేవని తెలిపారు. బొగ్గు సమస్య ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని గుర్తుచేశారు. బొగ్గు సమస్యను అధిగమించేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అనిల్ తెలిపారు.