హైదరాబాదీయులకు సూపర్ న్యూస్

సుమారు మూడు నెలల తర్వాత హైదరాబాదు రోడ్లపై సిటీ బస్సులు పరుగెట్టనున్నాయి. ఇప్పటికే రెండున్నర నెలలుగా సిటీ బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇక ప్రజారవాణాను ప్రారంభించడానికే తెలంగాణ సిద్ధమైంది.


జూన్ 8 నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అయితే మునుపటి లాంటి ప్రయాణం ఉండదు. రద్దీగా తిరిగే బస్సులు కనపడవు. సీట్ల వరకే మనుషులు పరిమితం. ఒకప్పుడు కిక్కిరిసి తిరిగిన బస్సులు ఇప్పట్లో అలా కానరావు.

తాజాగా ఈరోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం సడలింపులతో ఇప్పటికే ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. ప్రైవేటు వాహనాలు మినహా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది.

కరోనా ముందు నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇపుడు ప్రత్యేక నిబంధనలతో ఆ సంఖ్య గణనీయంగా పడిపోనుంది. బస్సుల్లేక షేర్ ఆటోలు పోలీసుల కళ్లు గప్పి తిప్పుతున్నారు. ఇద్దరిని ఎక్కించాల్సిన ఆటోలు నలుగురు ఐదుగురిని ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కిస్తున్నారు.