ముంద‌స్తు లేన‌ట్టే.. వైసీపీలో ఎందుకీ మార్పు..!

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్లాన్ చేసుకుంటున్నార‌ని.. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపార‌నే ఇటీవ‌ల కాలంలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముంద‌స్తుకు ప్లాన్ చేసుకుంద‌ని చ‌ర్చ‌కూడా న‌డిచింది. అయితే దీనిలో పీకే టీం.. స‌ర్వే చేస్తున్న మాట వాస్త‌వ‌మే. అదే స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జగ‌న్ కూడా భావించిన మాటా వాస్త‌వ‌మే. అయితే.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా నిర్ణ‌యం మార్చుకున్నారు. ముంద‌స్తుకు వెళ్ల‌డం వ‌ల్ల ఇప్పుడు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు రావ‌డంతో జ‌గ‌న్ త‌న ముంద‌స్తు నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్టు సీనియ‌ర్ల నుంచి జిల్లా నాయ‌కుల‌కు వ‌ర్త‌మానం అందింది.

ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. దీంతో ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే.. స్థానిక‌, కార్పొరేష‌న్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ త‌మ‌కు భారీ విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని కూడా లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. తాజాగా పీకే రంగంలోకి దిగిన త‌ర్వాత‌.. వాస్త‌వ ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంద‌నే విష‌యం అధిష్టానికి అర్ధ‌మైంద‌ని అంటున్నారు. అంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌పై ఆధార‌ప‌డి.. ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌న్న ధీమా వ్య‌క్తం చేయ‌డం స‌రికాద‌నే అంచ‌నాలు.. పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ సూత్రం ఆధారంగానే ముంద‌స్తుకు వెళ్ల‌డం మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైందని.. అందుకే దీనిపై ఇప్పుడు వాయిదా ట‌ర్న్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉండ‌డం.. వ‌చ్చే ఏడాది ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే ప‌రిస్థితి కూడా క్షీణిస్తున్న‌నేప‌థ్యంలో సంక్షేమాన్ని న‌మ్ముకుని ముందుకు వెళ్లే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, క్షేత్ర స్థాయిలో అభివృద్ధి విష‌యం కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా మౌలిక స‌దుపాయాలు, ర‌హ‌దారుల నిర్మాణంపై ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం.. ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణంగా మారుతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

మ‌రో వైపు.. జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి క‌నుక ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం ఖాయ‌మ‌ని కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల ప‌నితీరుపై కూడా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని.. సో.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయ‌ట‌. దీంతో వైసీపీ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింద‌ని.. ముంద‌స్తు నుంచి అడుగులు వెన‌క్కి వేస్తోంద‌ని అంటున్నారు. దీనిపై జిల్లాల్లో జోరుగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.