ఈ పదవులతో ఏమన్నా ఉపయోగముంటుందా ?

గురువారం మధ్యాహ్నం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే తొలిసారి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీతో పాటు ఆఫీస్ బేరర్లలో తెలుగు నేతలకు చోటు దక్కిందట. ఏపి నుండి కన్నా లక్ష్మీనారాయణకు తెలంగాణా నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు కు అవకాశం వచ్చిందట. ఇక ఆఫీసు బేరర్లుగా తెలంగాణా నుండి డీకే అరుణ, ఏ పి నుండి దగ్గుబాటి పురందేశ్వరికి చోటు దక్కిందట.

ఓ జాతీయ పార్టీలో అందులోను అధికారంలో ఉన్న పార్టీ జాతీయ కార్య నిర్వాహక కమిటీలో తెలుగు నేతలకు చోటు దక్కడం సంతోషించాల్సిందే. కానీ దానివల్ల పదవులు అందుకున్న వారికి తప్ప రాష్ట్రాలకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా ? అనేది కూడా కాస్త ఆలోచించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గరనుండి అంటే దాదాపు ఏడున్నరేళ్ళుగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది.

2014 రాష్ట్ర విభజన చట్టంలో ఏపీ ప్రయోజనాల కోసం నిర్ణయించిన ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ మోడీ సర్కార్ గాలికొదిలేసింది. న్యాయబద్దంగా రావాల్సిన వాటిని కూడా అరకొరగా విదిలిస్తోంది. ఇంతోటి దానికి మళ్ళీ ఏపీని తామేదో ఉద్దరించేస్తున్నట్లు కమలనాథులు గొప్పలకు పోతున్నారు. ఇక తెలంగాణాలో అయితే హనుమకొండకు శాంక్షన్ అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ యూనిట్ ను మహరాష్ట్రకు తరలించేశారు. యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ కు దిక్కేలేదు.

రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో అడుగడుగునా అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పార్టీ పదవులిచ్చేసి రాష్ట్రాలకు పెద్ద పీట వేసినట్లు ఫోజులు కొడుతోంది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వల్ల తెలంగాణాకు ప్రత్యేకంగా జరిగిన ఉపయోగం ఏమిటో ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కేంద్రమంత్రిగానే రాష్ట్రాన్ని ఉద్దరించలేని కిషన్ ఇక పార్టీ జాతీయ కమిటిలో ఉండి చేయగలిగేదేముంది ?

ఇక ఏపీలో అయితే ఒక్క నేత వల్ల కూడా రాష్ట్రానికి ఒరిగే ఉపయోగం ఏమీ లేదు. వైజాగ్ స్టీల్స్ ను కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నా అందరు చోద్యం చూస్తున్నారు. కనీసం ప్రజల కోసమన్నా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క నేత ప్రకటన కూడా చేయలేదు. ఇలాంటి నేతల వల్ల ఎలాంటి ఉపయోగం లేనపుడు ఎంతమంది నేతలు ఎన్ని కమిటిల్లో ఉంటే మాత్రం రాష్ట్రానికి ఉపయోగం ఏమిటి ?