అమరావతిపై మరో వివాదానికి తెర తీసిన ప్రభుత్వం

ఏపీ సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడంఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా జగన్ వదిలేశారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నా… వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులంటూ చెబుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతి కాదని, విశాఖ అని కొన్ని చోట్ల రావడం కలకలం రేపింది. అయితే, ఆ వ్యవహారం వివాదాస్పదం కావడంతో కేంద్ర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలే కాదు అందుకు తగ్గట్లు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. తాజాగా పదో తరగతి తెలుగు పాఠ్యాంశాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించారు. అందులో, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ని చేర్చారు. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ కూడా వివరించారు. అయితే, తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో అమరావతి పాఠాన్ని పాఠశాల విద్యాశాఖ తొలగించడం వివాదానికి కేంద్ర బిందువైంది.

తాజాగా 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం చర్చనీయాంశమైంది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను సేకరించి కొత్త పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. అయితే, పాత పుస్తకాల ప్రకారం సిలబస్ చెబుతున్న ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు. మరి, ఈ వివాదంపై ప్రభుత్వం స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.