హైకోర్టు ఈసారి జ‌గ‌న్ స‌ర్కారుకు ఝ‌ల‌క్ ఇవ్వ‌లేదు

YS-Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు షాక్.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు మ‌రో ఝ‌ల‌క్.. ఇలా గ‌త ఏడాది కాలంలో ఎన్ని వార్త‌లు చూశామో. ఏడాది వ్య‌వ‌ధిలో 60 సార్ల‌కు పైగా హైకోర్టులో జ‌గ‌న్ స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను పున‌ర్నియ‌మించాల‌ని, ఆయ‌న్ని తొల‌గించేందుకు తీసుకొచ్చిన ఆర్డిన‌న్స్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని హైకోర్టు తీర్పిస్తూ ఏపీ ప్ర‌భుత్వానికి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ పిటిష‌న్ హైకోర్టుకు వెళ్లినా.. మొట్టికాయ‌లు త‌ప్ప‌ట్లేదు. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓ కేసు విష‌యంలో ఊర‌ట ల‌భించింది. ప్ర‌భుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది.. మీడియాకు వ్య‌తిరేకంగా తీసుకొచ్చిన జీవో విష‌యంలో కావ‌డం గ‌మ‌నార్హం.

మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 విషయంలో జ‌గ‌న్ స‌ర్కారుకు ఊర‌ట ల‌భించింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తప్పుబట్టింది. ఇందులో న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు, మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఈ జీవో తీసుకురాలేదని.. మీడియా సంస్థలు వాస్తవాలనే ప్రజలకు చూపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న ప్రభుత్వ తరపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది. గత ఏడాది డిసెంబరులో జీవో 2430ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.. దాని ప్రకారం ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించి నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పించింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసే అవ‌కాశం క‌ల్పించారు. ఇది పత్రికా స్వేచ్ఛ‌ను హ‌రించే జీవో అంటూ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.