పవన్ కామెంట్స్ తో చిరుకి సంబంధం లేదట!

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ప్రభుత్వం చొరవ చూపిస్తోందని మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదన్నారు. సినిమా ఇండస్ట్రీ ఆన్‌లైన్‌ టికెటింగ్ విషయంలో సానుకూలంగా ఉందని చెప్పారు. ఇండస్ట్రీలో జరుగుతున్నా పరిణామాలపై చర్చించడానికి నిర్మాతలు వచ్చారని చెప్పారు

టికెట్ రేట్లు తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని.. ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిందని దీనిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా నిర్మాతల బృందం కోరినట్లు పేర్ని నాని చెప్పారు. కరోనా కారణంగా ఇండస్ట్రీ బాగా నష్టపోయిందని.. ఇప్పటివరకు థియేటర్లో ఉన్న యాభై శాతం ఆక్యుపెన్సీను వంద శాతానికి పెంచాల్సిందిగా కోరినట్లు చెప్పారు. దీనిపై ముఖమంత్రి సానుకూలంగా స్పందించే సమయంలో ఒక నటుడి వలన దురదృష్ట పరిణామాలు తలెత్తాయని పేర్ని నాని తెలిపారు.

పవన్ అభిప్రాయాలకు తాము సపోర్ట్ చేయడం లేదని.. పవన్ చేసిన కామెంట్స్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలానే తాను చిరంజీవితో మాట్లాడానని.. ‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారని చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమకి సంబంధం లేదని చిరు చెప్పిన విషయాన్ని బయటపెట్టారు. ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు చెప్పినట్లు పేర్ని నాని వెల్లడించారు.