వైసీపీకి ‘క్యాంపు’ నొప్పులు!

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇది నిన్న‌టి ఆనందం.. కానీ, ఇవే ప‌రిషత్‌ల‌లో.. ఇప్పుడు సొంత పార్టీకి క్యాంపు రాజ‌కీయాలు త‌ల‌నొప్పులు తెస్తున్నాయి. ఒక జిల్లా అని కాదు.. క‌నీసం నాలుగైదు జిల్లాల్లో క్యాంపు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ స్థానాల్లో వైసీపీ దూకుడు చూపింది. టీడీపీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన ద‌రిమిలా.. వైసీపీ గుండుగుత్తుగా జిల్లా ప‌రిష‌త్‌ను చేజిక్కించుకుంది. ఇక‌, మండ‌ల ప‌రిష‌త్‌లలో.. 700 స్థానాల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. ఇదే ఇప్పుడు.. వైసీపీకి ఇబ్బందిగా మారింది.

జిల్లా ప‌రిష‌త్ స్థానాల్లో చైర్మ‌న్ల‌ను ముందుగానే నిర్ణ‌యించారు. సో.. ఇక్క‌డ ఇబ్బంది లేదు. కానీ, మండ‌ల ప‌రిష‌త్‌ల‌లో వ‌ర్గ పోరు పెరిగిపోయింది. మండ‌ల ప‌రిష‌త్‌ల‌లో బీఫారాలుపొందిన వారిలో.. ఎమ్మెల్యే వ‌ర్గం.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్గం.. ఎంపీ వ‌ర్గాలు ఉన్నాయి. ఎంపీలు త‌మ అనుకూలురుకు.. ఎంపీటీసీ టికెట్లు ఇప్పించుకున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు,.. సీనియ‌ర్లు కూడా ఇలానే చేశారు. అయితే.. అప్ప‌ట్లో వారిని సంతృప్తి ప‌రిచేందుకు పార్టీ అధిష్టానం ఇలా చేసింద‌నే టాక్ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు అంద‌రూ గెలిచారు. దీంతో ఎంపీపీ ఎన్నిక‌.. విష‌యంలో వ‌ర్గ పోరు మరింత పెరిగింది.

మా వ‌ర్గానికి చెందిన వారే ఎంపీపీ కావాల‌నే ప‌ట్టుతో నాయ‌కులు ఆధిప‌త్య పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి.. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా ఉంది. అదేవిధంగా చిత్తూరు, తూర్పు గోదావ‌రి జిల్లాల్లోనూ.. ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతోంది. ఎవ‌రిని కాదంటే.. ఏమ‌వుతుందో.. అనే ప‌రిస్థితి తీసుకువ‌చ్చారు. ఈ ప‌రిణామాన్ని ముందు ఊహించ‌క‌పోవ‌డం.. ఇప్పుడు ఎంపీపీ ఎన్నిక‌ల‌కు రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డంతో వైసీపీ అధిష్టానం త‌ల ప‌ట్టుకుంది.

ద‌ర్శిలో ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుకు, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లికి మ‌ద్య ఎంపీపీ విష‌యంలోనే వివాదం రేగింది. అదేవిధంగా చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి వ‌ర్గానికి.. ఎంపీ వ‌ర్గానికి మ‌ధ్య వివాదం రేగింది. ఎంపీపీ కోసం.. ఇరు వ‌ర్గాలు పోరాడుతున్నాయి. మ‌రికొన్నిచోట్ల‌.. త‌మ‌కు బ‌లం లేక‌పోవ‌డంతో ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలో వైసీపీ కొత్త ఎత్తుగడకు తెర తీసింది. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నిక జరిగిన ఒక్క మండలాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.

18 ఎంపీటీసి స్థానాలలో 9 టీడీపీ, 1 జనసేన కైవసం చేసుకుంది. దీంతో టీడీపీకి ఎంపీపీ పీఠం వరించనుంది. కాగా టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. గత మూడు రోజుల నుంచి దుగ్గిరాల తహశీల్దార్ తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట‌లోనూ ఇదే ప‌రిస్థితి నెలకొంది. ఇక్క‌డ మొత్తం 17 ఎంపీటీసీల‌కు.. టీడీపీ 7, జ‌న‌సేన 4 , వైసీపీ ఆరు గెలుచుకుంది.

దీంతో ఎంపీపీ టీడీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంది. జ‌న‌సేన‌తో టీడీపీ చేతులు క‌ల‌ప‌నుంది. అయితే.. మంత్రి రంగ‌నాథ‌రాజు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇక్క‌డా క్యాంపు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచినా.. ఈ క్యాంపు రాజ‌కీయాల‌ను మాత్రం నిలువ‌రించే అవ‌కాశం లేకుండా పోయింది.