పంతం నెగ్గించుకున్న సిద్ధూ

క్రికెట్ మైదానంలో సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై పెత్త‌నం చ‌లాయించిన మాజీ క్రికెట‌ర్ న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు పంజాబ్ రాజ‌కీయాల్లోనూ అదే దూకుడుతో కొన‌సాగుతూ త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై ఇప్పుడ‌దే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌వ‌డం ద‌గ్గ‌ర నుంచి ఇప్పుడు తాజాగా సీఎంగా అమ‌రీంద‌ర్ రాజీనామా ఆ త‌ర్వాత చ‌రణ్‌జిత్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌వ‌డం.. ఇలా అన్ని విష‌యాల్లోనూ సిద్ధూ త‌న పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏర్ప‌డిన ఈ వివాదానికి ప్ర‌ధాన కార‌ణం సిద్ధూనే అని మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్‌తో సహా కొన్ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సిద్ధూది.. మొద‌టి నుంచి తాను అనుకున్న‌ది సాధించి తీరేదాకా అస్స‌లు వెన‌క్కుత‌గ్గ‌ని వైఖ‌రి. అటు ఆట‌లోనైనా.. ఇటు రాజ‌కీయాల్లోనైన ఆయ‌న అదే దూకుడుతో సాగుతున్నారు. 2004లో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన ఆయ‌న.. 2009 ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌భేరి మోగించారు. 2016లో ఆయ‌న‌ను బీజేపీ రాజ్య‌స‌భ‌కు పంపితే పార్టీపై అసంతృప్తితో ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2017 పంజాబ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇటీవ‌ల అమ‌రీంద‌ర్ ప్ర‌భుత్వ వైఖ‌రిపై అసంతృప్తితో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అమ‌రీంద‌ర్‌తో విభేధాలు తార‌స్థాయికి చేర‌డంతో సిద్ధూ త‌న‌కు అనుకూల వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నార‌నే టాక్ ఉంది. త‌న‌కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల‌తో అమ‌రీంద‌ర్‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వ‌తున్నాయి.

పైగా అమ‌రీంద‌ర్ వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధూకే పీసీసీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. దీంతో అప్పుడు త‌న పంతం నెగ్గించుకున్న సిద్ధూ ఆ త‌ర్వాత అమ‌రీంద‌ర్‌పై మ‌రింత పైచేయి సాధించ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడు. త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో క‌లిసి అమ‌రీంద‌ర్ ప‌నితీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు ఎప్ప‌టిక‌ప్పుడూ సిద్ధూను స‌మ‌ర్థంగానే ఎదుర్కొన్న అమ‌రీంద‌ర్‌.. కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధూ వైపే మొగ్గు చూప‌డంతో నిస్స‌హాయుడిగా మారిపోయారు. దీంతో తీవ్ర ఒత్తిడితో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి సిద్ధూ పంతం నెగ్గిన‌ట్ల‌యింది.

ఇక తాజాగా త‌న వ‌ర్గానికి చెందిన చ‌రణ్‌జిత్ సింగ్ సీఎం కావ‌డంతో సిద్ధూ చాలా సంతోషంగా ఉన్నాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రిగా చ‌రణ్‌జిత్ తెర ముందు క‌నిపించిన‌ప్ప‌టికీ తెర వెన‌కాల నుంచి ఆయ‌న‌ను న‌డిపించే ప‌వ‌ర్ సిద్ధూ చేతుల్లోనే ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు ఆయ‌న ఆడించిన‌ట్లే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆడే అవ‌కాశాలున్నాయి. దీంతో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో త‌న వ‌ర్గం వాళ్ల‌కు ఎక్కువ సీట్లు ఇప్పించి వాళ్ల‌ను అధికారంలోకి తీసుకువచ్చేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న సిద్ధూకు ఇప్పుడు ఇలా మంచి ఛాన్స్ దొరికింద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.