అమ్మకానికి రైలు బోగీలు…అద్దెకైనా పర్వాలేదట

నరేంద్ర మోడీ సర్కార్ ప్రైవేటీకరణలో చాలా స్పీడు పెంచుతోంది. ఇందులో భాగంగానే రైళ్లతో పాటు రైళ్ళ బోగీలను అమ్మకానికి, లీజుకు, అద్దెకు కూడా ఇచ్చేయాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పర్యాటక శాఖ, సినిమా రంగాల్లో బాగా అభివృద్ధి జరగటానికి అవకాశాలున్నట్లు కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. రైళ్ళను, బోగీలను అద్దెకు ఇవ్వటం వల్ల సాంస్కృతిక, పర్యాటక, సినిమాతో పాటు మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో స్పీడ్ పెరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ భావిస్తోంది.

రైళ్ళ బోగీలను కొనుక్కున్న వాళ్ళు, అద్దెకు తీసుకున్న వాళ్ళు వాటిని ఏ పద్ధతిలో నిర్వహించాలని అనుకుంటున్నారనే విషయాన్ని ముందుగానే రైల్వేశాఖకు చెప్పాల్సుంటుంది. ఎందుకంటే రైళ్ళను కొనుక్కోవటమంటే ఏదో కారును కొని ఇంట్లో పార్కు చేసుకున్నట్లు కాదు. రైళ్లు నిలపాలంటే అందుకు కచ్చితంగా ప్లాట్ ఫారంలు ఉండాల్సిందే కదా. ప్లాట్ ఫారం ఉండాలంటే అందుకు ముందుగానే ఒప్పందాలు చేసుకోవాల్సుంటంది. ఎందుకంటే రన్నింగ్ ట్రైన్లను నిలపాలంటే ప్లాట్ ఫారాల్లో ముందుగానే బుక్ చేసుకోవాలి.

ఒకవైపు రైల్వేశాఖ ఆధీనంలోని రైళ్ళు మరోవైపు ప్రైవేటు రంగంలో రైళ్ళను నిలపటంతో ప్రయాణికుల్లో అయోమయం ఏర్పడకూడదు. అందుకనే రైళ్ళను నిలిపి ఉండే ప్లాట్ ఫారంల విషయంలో స్పష్టత కోసం రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ళను లీజు, అద్దెకు తీసుకునే వాళ్ళు కనీసం 16 బోగీలను తీసుకోవాలనే నిబంధన పెట్టింది. తాము తీసుకున్న రైళ్ళను ఏ రూటులో నడపాలని అనుకుంటున్నారు ? ఎన్ని ట్రిప్పులు తిప్పాలని అనుకుంటున్నారు ? అనే విషయాలను ముందుగానే రైల్వేశాఖకు చెప్పాల్సుంటంది.

రైళ్ళను లీజు, అద్దెలకు తీసుకునే సినీ నిర్మాతలకు ప్రయాణానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. తమ యూనిట్ మొత్తాన్ని ఒకేసారి షూటింగులు జరుపుకునే ప్రాంతాలకు తరలించవచ్చు. అలాగే కాశీ, ప్రయాగ, తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్ళాలంటే టూరిజం ట్రిప్పులను నిర్వహించే పర్యాటక రంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే కారణాలు ఏవైనా, సౌకర్యాలు ఏమైనా కానీండి ప్రభుత్వ ఆస్తులను అమ్మేయటంలో నరేంద్ర మోడీ సర్కార్ చాలా స్పీడుగా ఉందని మాత్రం అర్థమవుతోంది.