బ్రేకింగ్.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధర్ టాటా

ఈనాడు పత్రికలో వార్తలకంటే ముందు పాఠకులు ఎంతో ఆసక్తిగా చూసే అంశం.. కార్టూన్. తెలుగులో దశాబ్దాలుగా నంబర్ వన్ కార్టూనిస్ట్‌గా కొనసాగుతున్న శ్రీధర్ ఈ కార్టూన్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనాడుతో శ్రీధర్‌ది విడదీయరాని అనుబంధం. ఈనాడు పత్రిక వయసు 41 ఏళ్లయితే.. అందులో 40 సంవత్సరాలు శ్రీధర్ పని చేయడం విశేషం. అంటే ఈనాడుతో ఆరంభం నుంచి కొనసాగుతున్నారన్నమాట.

ఆయన కార్టూన్ల స్థాయి గురించి.. అవెంతగా తెలుగు పాఠకులకు అలరించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏవో కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప ‘ఈనాడు’లో శ్రీధర్ కార్టూన్ లేని రోజు లేదు ఈ 40 ఏళ్లలో. అలాంటిది రేపట్నుంచి ఆ పత్రికలో శాశ్వతంగా శ్రీధర్ కార్టూన్ కనిపించబోదు. ఎందుకంటే శ్రీధర్ ‘ఈనాడు’కు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘లెఫ్ట్ ఈనాడు. రిజైన్డ్’ అంటూ ఓ సంక్షిప్త సందేశంతో ఆయనీ బ్రేకింగ్ న్యూస్‌ను వెల్లడించారు.

దీంతో శ్రీధర్ అభిమానులందరూ షాక్‌కు గురయ్యారు. ఈనాడు లేని శ్రీధర్‌ను.. శ్రీధర్ లేని ఈనాడును ఊహించుకోవడం చాలా చాలా కష్టం. ఆ రెంటికీ ఉన్న అనుబంధం అలాంటిది. శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడు పత్రిక కళ తప్పుతుందనడంలో సందేహం లేదు. ఆ పత్రికకు ఆయనొక వెల కట్టలేని ఆస్తే. మరి ఎందుకు ఆయన ఆ పత్రికను వదిలిపెడుతున్నారన్న ప్రశ్న అందరినీ తొలిచి వేస్తోంది.

శ్రీధర్ మరో పత్రికలో చేరే అవకాశాలు దాదాపు లేనట్లే అన్నది సన్నిహిత వర్గాల మాట. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ వయసు దాటేశారు. అయినా ఈనాడుతో కొనసాగుతూ వచ్చారు. ఐతే ఈ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడం.. కరోనా కారణంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని కోల్పోవడంతో ఆయన మానసికంగా కుంగిపోయారని.. అందుకే ఇక తన వృత్తికి సెలవిచ్చి ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటున్నారని.. అందుకే రిజైన్ చేసి ఉండొచ్చని సన్నిహితులు అంటున్నారు.