మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే..


ఆంధ్రప్రదేశ్‌‌లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ నేత అయిన నిమ్మల రామానాయుడు తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాతి పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచారు. ఐతే ఎమ్మెల్యేల్లో సాధారణంగా కనిపించే దర్పం ఆయనలో కనిపించవు. సైకిలేసుకుని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా మారిపోయింది.

సైకిల్ యాత్ర చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ కరోనా బాధితులకు సైకిల్లోనే తీసుకెళ్లి సరుకులు అందించడం ద్వారా ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓ సందర్భంలో వర్షం పడుతున్నా కూడా సైకిల్లోనే వెళ్లి సరకులు అందజేయడం విశేషం. కొందరు ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కని కొట్టి వేసినా.. సుదీర్ఘ కాలం ఇలా సైకిల్ మీద ప్రయాణిస్తూ జనాల్లో తిరగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. తాజాగా నిమ్మల రామానాయుడు తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

తన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోగా మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనం నడపాల్సిన డ్రైవర్ కరోనా బారిన పడటంతో ఇంకెవరూ వాహనం నడిపేందుకు ముందుకు రాలేదని నిమ్మల రామానాయుడికి తెలిసింది. దీంతో ఆయనే స్వయంగా ఆ వాహనాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఏమీ ఆలోచించకుండా వైకుంఠ రథాన్ని నడిపారు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని విమర్శించేవాళ్లూ ఉన్నారు కానీ.. ఆ కోణంలో చూసినా ఇలా చేయడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారన్నది ప్రశ్న. అందుకే చాలామంది నిమ్మల రామానాయుడిని ప్రశంసిస్తున్నారు.