జగన్ పై కేవీపీ కామెంట్లు చూశారా ?

రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డే పవర్ ఫుల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టంగా చెప్పారు. జగన్ పై జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసిందని ఇండియా టు డే ప్రచురించిన మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేవీపీ మాట్లాడుతూ ఆ సర్వేని కొట్టిపారేశారు. మీడియాతో కేవీపీ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే జగనే చాలా పవర్ ఫుల్ అని తేల్చేశారు. జగన్ ను సవాలు చేసే స్ధితిలో ఏ ప్రతిపక్షం కూడా లేదన్న విషయాన్ని కేవీపీ గుర్తుచేశారు.

అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ పాలనపైనే జనాలందరూ పాజిటివ్ గా ఉన్నారని చెప్పారు. ఒకపుడు దివంగత వైఎస్సార్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్ పాలన పైన కూడా అప్పట్లో ప్రతిపక్షాలు, మీడియా ఎంత దుమ్మెత్తిపోసినా రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని కేవీపీ గుర్తుచేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో తాను చెప్పలేనని అన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మధ్యనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని ఆరుగురు సీనియర్ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అందుకు తగ్గట్టుగా నేతలు వేదికను ఏర్పాటు చేయాలని రాహుల్ ఆదేశించారు. కాంగ్రెస్ నుండి ఇతర పార్టీల్లోకి ప్రధానంగా వైసీపీలోకి వెళ్లిపోయిన నేతలను వెనక్కి పిలిపించాలని, వైసీపీ ఓటు బ్యాంకును తిరిగి తీసుకోవాలని రాహుల్ గట్టిగా చెప్పారు.

మరి ఆ భేటీలో రాహుల్ తో ఎవరు ఏమి చెప్పారో తెలీదు కానీ తాజాగా కేవీపీ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ పాపులారిటీ, పవర్ గురించి నేరుగా మీడియాతోనే ప్రస్తావించారంటే కేవీపీ మనసులోని మాటనే బయటపెట్టారని అనుకోవాలి.