ఆఫ్ఘన్ ను బిగించేస్తున్న ప్రపంచం

తాలిబన్లు చెరపట్టిన ఆఫ్ఘనిస్థాన్ ను యావత్ ప్రపంచం అన్ని వైపుల నుండి బిగించేస్తోంది. అన్ని వైపుల నుండి బిగించేయటమంటే దేశంలోని జనాలను ఇబ్బందులకు గురిచేయటం ప్రపంచ దేశాల టార్గెట్ కాదు. వాళ్ళ టార్గెట్ అంతా తాలిబన్లను లొంగదీసుకోవటమే. ఈ విషయంలో ముందుగా అమెరికా చొరవ చూపించింది. అమెరికాను తర్వాత ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఆప్ఘనిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది.

ముందుగా అమెరికా విషయం తీసుకుంటే అమెరికాలోని ఆప్ఘన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులను ఫ్రీజ్ చేసేసింది. అలాగే తాలిబన్లు దాచుకున్న సుమారు 10 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ. 71 వేల కోట్లు ఫ్రీజ్ చేసింది. దీనివల్ల ఆఫ్ఘన్ సంగతి పక్కన పెట్టేసినా ముందు తాలిబన్లకు నిధుల ప్రవాహం ఆగిపోతాయి. దీంతోపాటు ఆప్ఘన్ బ్యాంకు ఖాతాను కూడా స్తంబింపచేయటం వల్ల అమెరికన్ బ్యాంకుల్లో ఉన్న వేలాది కోట్ల రూపాయలు తీసుకునేందుకు లేదు. బ్యాంకులు, నిధుల విషయంలో ఎప్పుడైతే అమెరికా కఠిన చర్యలు తీసుకుందో వెంటనే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి చాలా దేశాలు కూడా తాలిబన్లు, ఆఫ్ఘన్ ఖాతాలను నిలిపేశాయి. దీనివల్ల దేశాన్ని నడపటానికి అవసరమైన నిధులు తాలిబన్లకు ఆగిపోతాయి.

ప్రస్తుతం ఆప్ఘన్లోని బ్యాంకుల్లో ఉన్న డబ్బు, అత్యవసర ఖర్చుల కోసమని అధ్యక్ష భవనంలో దాచిన మిలియన్ల డాలర్లు, బంగారం, వెండి నిల్వలను అమ్ముకోవటమే తాలిబన్లకున్న ఏకైక మార్గం. ఆప్ఘన్లో ఎక్కడ చూసినా అమెరికా డాలర్ల చెలామణే కనబడుతుంది. హఠాత్తుగా డాలర్లు రావడం ఆగిపోతే అప్పుడు ఆర్ధికంగా తాలిబన్లకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం అనధికారికంగా దేశం మొత్తం మీద ఓపిఎంను తాలిబన్లు సాగుచేస్తున్నారు. సుమారు 13 వేల టన్నుల ఓపియంను ప్రపంచ దేశాలకు తాలిబన్లు పంపుతున్నారు.

మొన్నటి వరకు ఓపిఎం సాగు, అమ్మకం జరిగింది కానీ ఇప్పుడు ఓపిఎంను సాగుచేయచ్చు కానీ అమ్మకం కష్టమే. కాకపోతే మిత్రదేశాలైన చైనా, పాకిస్ధాన్ ద్వారా అమ్మకాలు చేయాల్సుంటుంది. ఇదే సందర్భంలో ఆప్ఘన్ కు చైనా నిధులను అందించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరి దీన్ని ప్రపంచ దేశాలు ఎలా అడ్డుకుంటాయో చూడాలి. మిగిలిన దేశాలు అమెరికా మాటకు కట్టుబడున్నా చైనా ఏమాత్రం లెక్క చేయదని అందరికీ తెలిసిందే.

నిధుల ప్రవాహం ఆగిపోవటం వల్ల ముందు ముందు దేశంలో ఆహార కొరత, ఉద్యోగులకు జీతాలు చెల్లింపు సమస్య అయిపోతుంది. అలాగే ఆసుపత్రులు, విద్యాసంస్ధల నిర్వహణతో పాటు సంక్షేమ పథకాలు గారికి కొట్టుకుపోవడం ఖాయం. ఓపిఎం సాగు కారణంగా ఆహార పంటల సాగు దేశంలో తగ్గిపోయింది. ముందు ముందు 1.40 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడటం ఖాయమని ఐక్యరాజ్యసమితి ఆందోళన పడుతోంది. మరి ఈ సమస్యను తాలిబన్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.