ఆప్ఘాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నాయకుడు..?

ఆప్ఘనిస్తాన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. దేశాధ్యక్షుడు పారిపోయాడు. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో… దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే రాజధాని కాబూల్‌ను ఆక్రమించడంతో ప్రభుత్వం లొంగిపోయింది. అలాగే శాంతియుతంగా అధికార బదిలీ వుంటుందని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అధ్యక్షుడిగా ఆశ్రఫ్‌ ఘనీ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త దేశాధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్‌ కామాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అబ్దుల్‌ ఘనీ.. ఆఫ్ఘన్‌ ముజాహిద్‌ కమాండర్‌ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్‌ సంస్థకు పనిచేశారు. గతంలో తాలిబన్ల పాలనలో ఓ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. 2010లో పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్ఐ), సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్ట్‌ చేశారు. దీంతో 2018 అక్టోబర్‌ 24 వరకు పాక్‌ జైలులో శిక్షను అనుభవించారు. అనంతరం అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు.

మరోవైపు విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, వారు భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్‌లో ఉన్న విదేశీయులు రిజిస్టర్‌ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని తిరిగి రావాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది.